తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సమాధి ప్రాంతంలో రూ.39 కోట్లతో స్మారక మండపాన్ని నిర్మించనున్నట్టు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. కలైవానర్ అరంగం హాలులో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం ఉదయం 110వ నిబంధనల కింద ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.
ఆ సందర్భంగా స్టాలిన్ ప్రసంగిస్తూ.. మెరీనాబీచ్లో కరుణానిధి సమాధి ప్రాంతం వద్ద 2.2 ఎకరాల్లో స్మారక మండపాన్ని నిర్మించనున్నామని తెలిపారు. ఏడుదశాబ్ధాలపాటు పాత్రికేయుడిగా, ఐదు దశాబ్దాలపాటు డీఎంకే నేతగా, రాజకీయాల్లోనే కాకుండా చిత్ర రంగంలోనూ, సాహిత్యరంగంలో రాణించిన కరుణానిధికి స్మారకమండపం నిర్మించడం సముచితమన్నారు.
13 సార్లు శాసనసభ ఎన్నికల్లో గెలిచి ఓటమి ఎరుగని వీరుడిగా, ఐదుసార్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఎనలేని సేవలను అందించారని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధిపరిచిన కరుణానిధి సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం పోరాడారన్నారు. ముఖ్యమంత్రిగా కరుణానిధి అమలు చేసిన పలు ప్రజా సంక్షేమపథకాలను స్టాలిన్ ఈ సందర్భంగా వివరించారు.