తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పాలన వల్లే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం ఆజంపురా డివిజన్లోని ఆజం ఫంక్షన్ హాల్లో పాతమలక్పేటకు చెందిన టీఆర్ఎస్ నేతలతో వరంగల్లో నిర్వహించి విజయోత్సవ సభ నేపథ్యంలో సన్నాహక సభను నిర్వహించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ మిగతా రాష్ర్టాల కంటే అత్యధికంగా ధాన్యం పండించే రాష్ట్రంగా స్థానం దక్కించుకుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు, నీటి కష్టాలతో రాష్ట్రం ఎడారి గా మారిందన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో రూపొందించిన ప్రాజెక్టులతో నేడు సస్యశ్యామలంగా మారిందన్నారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.
పాతనగరం అభివృద్ధి పై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. విజయగర్జనకు కార్యకర్తలు అధిక సంఖ్యలో కదలాలన్నారు. సమావేశంలో మలక్పేట, బహదూర్పురా, యాకుత్పురా, చాంద్రాయణగుట్ట, హైదరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జీలు ఆజం అలీ, ఇనాయత్ అలీ బాక్రీ, సుందర్రెడ్డి, రాంరెడ్డి, శ్రీకాంత్, మునావర్ ఖాన్, లాయక్ అలీ, మాజీ కార్పొరేటర్లు తీగల సునరితారెడ్డి, సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.