టి20 ప్రపంచకప్ 2021 తర్వాత విరాట్ కోహ్లి టి20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీమిండియా పాకిస్తాన్, న్యూజిలాండ్తో మ్యాచ్ల్లో దారుణ పరాజయాలు చవిచూసి సెమీస్ అవకాశాలను దాదాపుగా కోల్పోయింది.ఇక టీమిండియా సెమీస్కు చేరాలంటే అద్భుతాలే జరగాల్సిందే. తనకు కెప్టెన్గా ఇదే చివరి టి20 ప్రపంచకప్ కావడంతో ఎలాగైన టైటిల్ అందుకోవాలని భావించిన కోహ్లి ఆశలు గల్లంతయ్యాయి.
ఇదిలా ఉండగా.. టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న కోహ్లి పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోనున్నట్లు సమాచారం. కోహ్లికి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి వన్డే, టి20ల్లో రోహిత్కు నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు టి20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్తో జరగనున్న సిరీస్ సమయానికి సెలక్షన్ కమిటీ కెప్టెన్సీపై నిర్ణయం తీసుకుంటారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించి బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది. కెప్టెన్సీతో పాటు టీమిండియా కోచ్ పదవిపై కూడా చర్చలు జరగనున్నట్లు సమాచారం.
ఇప్పటికే కోహ్లి నాయకత్వంలోని జట్టు టి20 ప్రపంచకప్ 2021లో దారుణ ప్రదర్శన చేయడంతో బీసీసీఐతో సెలక్టర్లను ఆందోళనలో పడేసింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టి20 ప్రపంచకప్ 20222తో పాటు 2023 వన్డే వరల్డ్కప్లోగా కెప్టెన్సీ విషయంలో టీమిండియా ఇబ్బందులు పడకూడదని బీసీసీఐ భావిస్తోంది. ఒకవేళ కోహ్లి టెస్టు కెప్టెన్గా కొనసాగినా.. వన్డే, టి20ల్లో కెప్టెన్గా రోహిత్కు అవకాశమిస్తే బాగుంటుందని బీసీసీఐ అభిప్రాయపడుతోంది. ఇక మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు అనే ప్రతిపాధనను బీసీసీఐ ప్రస్తుతానికి పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. అలా చేయడం వల్ల జట్టు కన్ఫ్యూజన్కు గురయ్యే అవకాశం ఉంది.