గోవాలో బీజేపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. నిన్నటికి నిన్నే ఉత్పల్ పర్రీకర్ రాజీనామా చేసిన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మాజీ సీఎం, సీనియర్ నేత లక్ష్మికాంత్ పర్సేకర్ బీజేపీకి రాజీనామా చేశారు. ఇకపై పార్టీలో కొనసాగాలని అనుకోవడం లేదని, రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని ప్రకటించారు.
రాజీనామా తదనంతరం ఏమిటన్నది తర్వాత ఆలోచించుకుంటానని పర్సేకర్ పేర్కొన్నారు.బీజేపీ ప్రకటించిన జాబితాలో లక్ష్మికాంత్ పర్సేకర్ పేరు లేదు. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పాత తరం కార్యకర్తలను విస్మరిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.
2014 నుంచి 2017 వరకూ లక్ష్మికాంత్ పర్సేకర్ సీఎంగా బాధ్యలు చేపట్టారు. మనోహర్ పర్రీకర్ కేంద్ర మంత్రిగా వెళ్లిన తర్వాత పర్సేకర్ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. మొదటి జాబితాలో భాగంగా బీజేపీ 34 మంది లిస్టును ప్రకటించింది. మొత్తం 40 అసెంబ్లీ సీట్లు కాగా, మరో ఆరు సీట్లలో అభ్యర్థులను ప్రకటించాల్సి వుంది.