దిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టించేలా ఉన్నాయి. ఎన్నికల్లో ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు తమ పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది. పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్దూ సహా మిగతా నాలుగు రాష్ట్రాల అధ్యక్షులు రాజీనామాలు సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయించారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణదీప్ సూర్జేవాలా తెలిపారు. ఆయన ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అధికారంలో ఉన్న పంజాబ్ సహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఓటమి పాలైంది. ఈ ఎన్నికల ఓటమితో కాంగ్రెస్ పని అయిపోయిందంటూ విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఆ పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం సీడబ్ల్యూసీ కూడా సమావేశమైంది. ఓ దశలో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి గాంధీ కుటుంబం తప్పుకోవాలని భావించింది కూడా. అయితే ఆ పార్టీలోని సీనియర్ నేతలు, ముఖ్యనేతల సూచన మేరకు ఇంకొంతకాలం సోనియానే అధ్యక్షురాలిగా ఉండేందుకు అంగీకరించారు. ఈ క్రమంలోనే పార్టీని ప్రక్షాళన చేయాలని సోనియాగాంధీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ముందుగా పార్టీ ఓడిపోయిన ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్ల రాజీనామా కోరారు.