సంస్కరణవాది, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఘనంగా నివాళి అర్పించారు. ట్యాంక్ బండ్ పై బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అక్కడే ఉన్న ప్రజా గాయకుడు గద్దర్ తో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ…. బాబూ జగ్జీవన్ రామ్ సమాజంలో అంటరానివారికి సమానత్వం సాధించడానికి జీవితాన్నే అంకితం చేశారన్నారు. నవభారత నిర్మాణానికి ఆయన అలు పెరుగని కృషి చేశారని పేర్కొన్నారు.
ఆయన జీవితం అందరికీ ఆదర్శం అన్నారు. జీవితంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని సమాజంలోని అణగారిన వర్గాల కోసం పోరాడారన్నారు. 1946లో జవహర్ లాల్ నెహ్రూ యొక్క తాత్కలిక ప్రభుత్వంలో అతి పిన్నవయస్కులైన మంత్రి, భారతదేశపు మొదటి మంత్రి వర్గంలో కార్మిక మంత్రిగా సేవలందించారన్నారు. సమాజ అభివృద్ధి కోసం ఎన్నో కొత్త చట్టాలు, సంస్కరణలు తీసుకురావడంలో ఆయన పాత్ర మరువ లేనిదన్నారు.
33 ఏండ్లకు పైగా కేంద్ర కేబినెట్మంత్రిగా, దేశ ఉప ప్రధానమంత్రి గానూ డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ తీసుకున్న అసంఖ్యాక నిర్ణయాలు దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయని తెలిపారు. ముఖ్యంగా కేంద్ర వ్యవసాయ, ఆహార శాఖ మంత్రిగా ఆయన దేశంలోని ఆహార సమస్యల పరిష్కారం కోసం హరిత విప్లవానికి నాంది పలికారని చెప్పారు.అంబేద్కర్, జగ్జీవన్ రామ్ కలలు గన్న సమసమాజం కోసం తమ ప్రభుత్వం శాయశక్తుల కృషి చేస్తోందని, ఆ మహానీయుల స్ఫూర్తితో పని చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.