సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహిళా సాధికారత, సంక్షేమం, సమగ్ర వికాసం కోసం చేపడుతున్న పథకాల అమలులో అంగన్వాడీ టీచర్ల పాత్ర అత్యంత కీలకమైందని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సెలవులు లేకుండా, అలుపు రాకుండా అంగన్వాడీ అందిస్తున్న సేవలు గుర్తించి కేసీఆర్ మూడుసార్లు గౌరవ వేతనాలు పెంచారు.వారిని వర్కర్లు అనకుండా టీచర్లుగా సంబోధించాలని ఆదేశాలు ఇచ్చారని, వీరి వేతనాలను పీఆర్సీలో పెట్టారని మంత్రి తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం దగ్గర ఆధునీకరించిన జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ..మహిళలు, శిశువుల ఆరోగ్యం కోసం తల్లి తర్వాత తల్లిలాగా సేవలందిస్తున్న అంగన్వాడీలను అంతే గౌరవంగా చూడాలని సీఎం కేసీఆర్ వారికి అన్ని విధాల ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.తెలంగాణ రాష్ట్రం మహిళల సాధికారత, సమగ్ర సేవల , రక్షణ, పోషణ, ఆరోగ్యం కోసం దేశంలోనే అత్యుత్తమంగా పనిచేస్తోందన్నారు. గిరిపోషణ, పోషణ్ అభియాన్లో రాష్ట్రపతి, ప్రధాన మంత్రి అవార్డులు కూడా రావడం మన అంగన్వాడీలు చేస్తున్న సేవలకు గుర్తింపు అన్నారు.
మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు త్వరలోనే రాష్ట్రంలో ఉండే ఖాళీలు భర్తీ చేస్తున్నామని ప్రకటించారు.అనంతరం ట్రాన్స్ జెండర్లు తయారు చేసిన జూట్ బ్యాగులలో సానిటైజర్లు, మాస్కులు, జీసీసీ సబ్సులు, షాంపులు, హ్యాండ్ వాష్ లు కలిపి అంగన్వాడీలకు అందించారు. వీటితో పాటు జిల్లాలోని 1437 అంగన్వాడీ సెంటర్ల కోసం ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి 10 ప్లేట్స్, 10 గ్లాసుల చొప్పున అందించే కార్యక్రమానికి జిల్లా కేంద్రం నుంచి శ్రీకారం చుట్టారు.కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, జిల్లా కలెక్టర్ శశాంక, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలతా లెనినా ఉన్నారు.