హైదరాబాద్ మహానగరంలోని ఉస్మానియా దవాఖానలో పురాతన కట్టడానికి ఇబ్బంది కలుగకుండా, అదనపు భవనాల నిర్మాణానికి సంబంధించిన సమగ్ర నివేదికను త్వరగా ఇవ్వాలని చీఫ్ ఇంజినీర్ల కమిటీని మంత్రుల బృందం ఆదేశించింది. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో మంత్రులు మహమూద్ అలీ, తలసారి శ్రీనివాస్యాదవ్తో కూడిన బృందం సోమవారం ఎంసీహెచ్చార్డీలో చీఫ్ ఇంజినీర్ల కమిటీతో భేటీ అయ్యింది.
సమావేశానికి స్థానిక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన పురోగతిని చర్చించారు. కమిటీకి పలు సూచనలు చేశారు. ఉస్మానియా దవాఖాన శిథిలావస్థకు చేరడం, ప్రస్తుతం ఉన్న భవనాలు అవసరాలను తీర్చలేకపోతుండటంతో దాని స్థానంలో అత్యాధునిక వసతులతో నూతన దవాఖానను నిర్మించాలని సీఎం కేసీఆర్ గతంలో నిర్ణయించారు.
వందేండ్ల పురాతన భవనాన్ని కాపాడాలంటూ కొందరు కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం స్టే విధించింది. ఈ నేపథ్యంలో పాత భవనానికి ఇబ్బంది కలుగకుండా, కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త భవనాలను నిర్మించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ మేరకు చీఫ్ ఇంజినీర్ల కమిటీని నియమించగా.. వారు క్షేత్రస్థాయిలో పలుమార్లు పర్యటించారు. అనంతరం ప్రాథమిక నివేదికను రూపొందించి ఇటీవలే ప్రభుత్వానికి అందించారు. త్వరలో సమగ్ర నివేదికను అందించనున్నారు. దీనిని ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకోనున్నారు.