మధుమేహ రోగులతోపాటు అందరూ తినదగిన పండు బొప్పాయి. ఇందులో పోషక విలువలు అపారం. బొప్పాయి ఆకు, గింజ, పండు, కాయ.. అన్నీ విలువైనవే.
పోషకాలెన్నో
ఏడాదంతా దొరికే పండు ఇది. ఇందులో విటమిన్-ఎ,బి,సి,ఇ మాత్రమే కాదు.. మెగ్నీషియం, పొటాషియం, ఫొలేట్, లినోలియెక్ యాసిడ్, ఆంథాసిన్లు, బీటా కెరోటిన్లు, ఫ్లేవనాయిడ్స్, డైటరీ ఫైబర్స్… లాంటివి ఎన్నో ఉంటాయి. అందుకే బొప్పాయి అనేక వ్యాధులకు మందులా పనిచేస్తుంది. గాయాలను తగ్గిస్తుంది. కిడ్నీలతో పాటు కళ్లకు, జుట్టుకు మేలుచేస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. గుండె జబ్బులు దరిచేరకుండా చేస్తుంది.
కాయ మంచిదే
బాలింతలకు పాలు సమృద్ధిగా వచ్చేందుకు పచ్చి బొప్పాయి కాయ కూరను వడ్డిస్తారు. ఇందులో పీచు పదార్థాలు, శక్తి ఎక్కువ. బీటా కెరోటిన్లుగా పిలిచే వర్ణద్రవ్యాలతో పాటు, యాంటీ ఆక్సిడెంట్లు అయిన లైకోపీన్లూ అధికమే.
ఆకులు ఆరోగ్యకరం
బొప్పాయి ఆకుల రసాన్ని డెంగ్యూ, మలేరియా, నెలసరి నొప్పులు, చర్మ వ్యాధులు, గుండెమంట, కేశ సమస్యలు, మధుమేహం, హైపర్టెన్షన్ పరిష్కారానికి సిఫారసు చేస్తారు.
గింజలూ..
బొప్పాయి గింజల్లో భాస్వరం, ఇనుము, మెగ్నీషియం, క్యాల్షియం, పీచు, సంతృప్త కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు అపారం. కాలేయ సమస్యలను, వివిధ క్యాన్సర్లను ఈ విత్తనాలు నివారిస్తాయి.
ఎండబెట్టినా మెండే
బొప్పాయిని కోసి, ఎండబెట్టి నిల్వ చేస్తారు. వీటిలోనూ మినరల్స్, విటమిన్లు అపారం. కానీ కాలేయ, చర్మ రోగాలు, కిడ్నీ సమస్యలు ఉన్నవారికి బొప్పాయి పడకపోవచ్చు. నిపుణులను సంప్రదించాకే తినాలి.