టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఈ 8 ఏళ్లలో హైదరాబాద్లో 30 ఫ్లైఓవర్లు నిర్మించిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. మరో 17 ఫ్లైఓవర్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి సూచిక ప్రజా రవాణా, రహదారులేనని చెప్పారు. కూకట్పల్లిలోని కైతలాపూర్ వద్ద రూ.84 కోట్లతో నిర్మించిన ఫ్లై ఓవర్ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
బీజేపీ పాలనలో దేశంలో ఏ వర్గమూ సంతోషంగా లేదని కేటీఆర్ విమర్శించారు. అగ్నిపథ్ పేరుతో యువత పొట్ట కొడుతున్నారని ఆయన ఆరోపించారు. అగ్నిపథ్ ట్రైనింగ్లో బట్టలు ఉతకడం, హెయిర్ కట్, డ్రైవింగ్ నేర్పిస్తారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారని.. అవి నేర్చుకునేందుకు దేశ యువత మిలిటరీలో చేరాలా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
బీజేపీ నేతలు కులాలు, మతాల మధ్య పంచాయితీలు పెడుతున్నారని విమర్శించారు. దేశాన్ని రామరాజ్యం చేస్తామని చెప్పి.. రావణకాష్ఠం చేశారని ఆయన ఆరోపించారు. చేతనైతే హైదరాబాద్లో రక్షణ రంగానికి ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్రమంత్రి కిషన్రెడ్డిని ఉద్దేశించి అన్నారు.