హైదరాబాద్ సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాలికి గాయమైన కారణంగా ప్రగతి భవన్ నుంచే ఆయన సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ, జలమండలి, పురపాలక శాఖ అధికారులతో ఆయన రివ్యూ చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు.
మూసీ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా చూడాలని.. వర్షాలు కొనసాగితే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. కల్వర్టులు, బ్రిడ్జిల వద్ద వార్నింగ్ బోర్డులు పెట్టాలని కేటీఆర్ ఆదేశించారు.