టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్ష పదవిని డబ్బులిచ్చి కొనుక్కున్నారని.. సీఎం అయిపోయి రాష్ట్రాన్ని దోచుకోవాలని ఆయన చూస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన రాజగోపాల్రెడ్డి.. రేవంత్ తనపై చేసిన విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. కాంట్రాక్టుల కోసమే తాను పార్టీ మారుతున్నట్లు రేవంత్ ఆరోపించారని.. అదే విషయాన్ని నిరూపించకుంటూ పీసీసీ అధ్యక్ష పదవిని ఆయన వదులుకుంటారా? అని సూటిగా ప్రశ్నించారు.
రేవంత్ చిల్లర దొంగ.. బ్లాక్ మెయిలర్ అని రాజగోపాల్రెడ్డి ఆరోపించారు. ఏ వ్యాపారంలో లేని రేవంత్కు కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. ఓటుకు నోటు కేసులో జైలుకెళ్లిన అలాంటి వ్యక్తితో తాను నీతులు చెప్పించుకోవాలా? అని ప్రశ్నించారు. డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసే క్యారెక్టర్ రేవంత్రెడ్డిదని తీవ్రస్థాయిలో రాజగోపాల్రెడ్డి విరుచుకుపడ్డారు.
ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మునుగోడు ప్రజలు ఊరుకోరన్నారు. హుజూరాబాద్లో ఉప ఎన్నిక వస్తే ఏం పీకావ్?అంటూ రేవంత్ను ఉద్దేశించి ఆయన తీవ్రపదజాలం వాడారు. మునుగోడుకు వస్తే డిపాజిట్ కూడా రాదని చెప్పారు. రేవంత్ నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతుందని రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు.