కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ‘భారతదేశం 2023-24లో నామినల్ జీడీపీ వృద్ధిరేటు 10.5 శాతం ఉండబోతున్నద’ని చెప్పుకొచ్చారు. అయితే 2023-24లో ద్రవ్యోల్బణం 5 నుంచి 5.5 శాతంగా ఉండబోతున్నదని రిజర్వ్ బ్యాంక్ తన నివేదికలో పేర్కొన్నది. అంటే వాస్తవ జీడీపీ సుమారు 5 నుంచి 5.5 శాతానికి మించి ఉండకపోవచ్చునని ఆర్బీఐ గణాంకాలను క్రోడీకరించి చూస్తే అర్థమవుతున్నది. ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసిన జీడీపీని వాస్తవ జీడీపీ అంటారు.
సబ్సిడీలు తగ్గించి, పన్నులు పెంచి జీడీపీ పెరుగుదలను ఎక్కువచేసి చూపడం:
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రతులను నిశితంగా పరిశీలిస్తే… ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఇతర ప్రధాన సబ్సిడీలలో 28.3 శాతం తగ్గించారు. ఆ తగ్గింపు 1,53,996 కోట్లు అని బడ్జెట్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇదే సమయంలో కేంద్ర స్థూల పన్ను ఆదాయం, 2022- 2023 సవరించిన అంచనాలతో పోలిస్తే 2023-24లో 10.4 శాతంగా పెరిగి రూ. 3,17,791 కోట్ల పెరుగుదల నమోదు చేసుకోబోతున్నదని బడ్జెట్ అంచనాలు తెలియజేస్తున్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం పన్ను పెంపొందించుకొని, సబ్సిడీలు తగ్గించుకోవడం వల్ల 2023-24లో రూ.4,71,787 కోట్లు (2023-24 సవరించిన అంచనాలతో పోలిస్తే) అదనంగా పొందబోతున్నది.
2023-2024 అంచనాలను అనుసరించి భారత జీడీపీ సుమారు రూ.307 లక్షల కోట్లుగా ఉండవచ్చునని అంచనా. అదే సమయంలో పన్ను పెరగడం, సబ్సిడీ తగ్గడం మూలంగా 4.72 లక్షల కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతున్నది. ఇది జీడీపీలో సుమారు 1.2-1.3 శాతం. జీడీపీ=(జీవీఏ)+(ప్రభుత్వం పొందిన పన్నులు)-(ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు) అనే సమీకరణం ప్రకారం మనం పరిశీలించాలి.
జీవీఏ (గ్రాస్ వాల్యూ యాడెడ్) అంటే ఒక ప్రాంతం, పరిశ్రమ లేదా ఏదైనా ఆర్థిక రంగంలో ఉత్పత్తి అయిన సరుకుల, సేవల విలువ. ఆర్థిక మంత్రి జీవీఏ పెరుగుదలతో సంబంధం లేకుండా సుమారు 1.5 శాతం జీడీపీ పెరుగుదల పన్నును పెంపొందించి, సబ్సిడీ తగ్గించారని అర్థమవుతున్నది. అంటే 5 నుంచి 5.5శాతం వాస్తవ జీడీపీ పెరుగుదలలో 1 నుంచి 1.5 శాతం పెరుగుదల జీవీఏ పెరుగుదలతో సంబంధం లేకుండానే అంకెల గారడీ ద్వారా సాధించారని అని స్పష్టమవుతున్నది.
10 లక్షల కోట్ల మూలధన వ్యయంలోని గారడీ:
రాష్ర్టాలకు యాభై ఏండ్ల వరకు మూలధన వ్యయం కోసం 1.3 లక్షల కోట్ల మేరకు వడ్డీ రహిత రుణం ఇస్తామని కేంద్రం గొప్పగా ప్రకటించింది. అయితే ఇది రాష్ర్టాలకు ఇచ్చే ఎఫ్ఆర్బీఎం పరిధి అయిన జీఎస్డీపీలో 3-3.5 శాతం లోపే ఉంటుందని స్పష్టం చేసిం ది. అంటే రాష్ర్టాల అప్పుల శాతం పెంచనేలేదు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 అధికరణం (3), (4) సబ్క్లాజులను గమనించవలసి ఉన్నది. సబ్ క్లాజ్ (3) ప్రకారం- కేంద్రం ప్రభుత్వం స్వయంగా లేదా హామీతో ఇచ్చిన రుణం ఇంకా చెల్లించవలసింది ఉంటే, ఆ రాష్ట్రం కేంద్ర అనుమతి లేకుండా కొత్తగా అప్పు తీసుకోకూడదు. సబ్క్లాజ్ (4) ప్రకారం- కొన్ని షరతుల మేరకు కేంద్రం అనుమతి మంజూరు చేయవచ్చు. ఏ రాష్ట్రం అయినా కేంద్రానికి ఇప్పటికే బాకీ ఉంటే, కొత్తగా తీసుకునే అప్పు కోసం (ఎఫ్ఆర్బీఎం పరిధిలోని అప్పు కూడా) కేంద్ర అనుమతి పొందవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో 1.3 లక్షల కోట్ల వడ్డీ లేని రుణాన్ని రాష్ర్టాలపై కేంద్రం పన్నిన రాజ్యాంగబద్ధ కుట్రగా చూడవలసి వస్తుంది. ఇక ఏ రాష్ట్రమైనా రాజ్యాంగం ప్రతిపాదించిన ఆర్థిక సమాఖ్య స్ఫూర్తి నిలుపుకునేందుకు అప్పు నిరాకరిస్తే, మోదీగారు పంపినా రాష్ర్టాలు తీసుకోలేదనే రాజకీయ నిందలు వేయవచ్చు. ఈ విధంగా రాజకీయ కోణంలో బీజేపీ ప్రభుత్వ కుతంత్రాలు స్పష్టమవుతున్నాయి.
రైల్వే మూలధన వ్యవయం కోసం 2.4 లక్షల కోట్లు ఒక ఏడాదిలో ఉపయోగించుకోవడం కుదరదని, 1.2 లక్షల కోట్లకు మించి పనులు జరగకపోవచ్చునని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అంటే ఈ మిగిలిన 1.2 లక్షల కోట్లు ఆర్థిక లోటును పూరించుకోవడానికి ఉపయోగపడవచ్చునని మాజీ ప్రధాన గణాంకవేత్త ప్రణబ్ రాయ్ అభిప్రాయపడ్డారు. జాతీయ రహదారుల కోసం కేటాయించిన రూ.1.62 లక్షల మూలధన వ్యయం పరిస్థితి కూడా ఇదే విధంగా ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. అయితే కరోనా ప్యాకేజీలో ప్రకటించిన 20 లక్షల కోట్లలో 3.39 లక్షల కోట్లను ఎఫ్సీఐ కరోనాకు ముందు తీసుకున్న అప్పులను కట్టేందుకు ఉపయోగించారు. ఇదే విధంగా రైల్వేలు, రహదారులకు కేటాయించిన డబ్బు వాడుకుంటే తప్ప అంత మొత్తం ఖర్చయ్యే అవకాశం లేదు. అప్పు కట్టుకుంటే మూలధన వ్యయం కిందికి రాదనే విషయం అందరికీ తెలిసిందే. మూలధన వ్యయంలోని 10 లక్షల కోట్లలో 83 వేల కోట్లు బీపీసీఎల్కు, బీఎస్ఎన్ఎల్కు కేటాయించారని, ఇది పూర్తిగా మూలధన వ్యయానికి ఉపయోగపడే అవకాశమే లేదని భారత మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ గార్గ్ అభిప్రాయపడ్డారు. 2019-2020లో ప్రభుత్వం, పీఎస్యూలను కలిపిన మూలధన వ్యయం జీడీపీలో 3.9 శాతంగా ఉందని, 2023-2024లో కూడా అది సుమారుగా 3.9శాతంగా ఉండబోతున్నదని ప్రముఖ ఆర్థికవేత్త రథిన్ రాయ్ తన పరిశోధనా వ్యాసంలో నిరూపించారు. అంటే పీఎస్యూల మూలధనవ్య యం గణనీయంగా తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే 2023-2024లో చూపిస్తున్న మూలధన వ్యయం 2019-20 నాటి కన్నా ఎక్కువేం కాదు.
సంక్షేమ ప్రధాన తెలంగాణ బడ్జెట్: రైతుబంధు పథకం కోసం రూ.11,704 కోట్లు, దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన పథకం ‘దళితబంధు’ కోసం రూ.17,700 కోట్లు, ఆసరా పింఛన్ల కోసం 2,740 కోట్లు, కరెంటు సబిడ్సీ కోసం 8,760 కోట్లు, డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం 11,000 కోట్లు – ఈ విధంగా ప్రజా సంక్షేమానికి మొత్తం సుమారు రూ.55 వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వం వినియోగించబోతున్నది.
సంక్షేమ, సబ్సిడీ బడ్జెట్ తగ్గించుకునే మోదీ ప్రభుత్వానికి, ప్రజా సంక్షేమానికి, ప్రజా అవసరాలకు పెద్దపీట వేస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్న తేడాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.