తెలంగాణలో నిజామాబాద్లో పసుపు బోర్డు పెట్టేదిలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇప్పటికే ఏర్పాటుచేసిన సుగంధ ద్రవ్యాల (స్పైసెస్) బోర్డు రీజినల్ ఆఫీస్తో సరిపెట్టుకోవాలని సూచించింది. దేశంలోనే అత్యధికంగా పసుపు పండిస్తున్న తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయంచేసింది. వంద రోజుల్లో బోర్డు సాధిస్తామంటూ ఓట్లు దండుకొని.. గెలిచిన తర్వాత మాయమాటలు చెప్తూ మభ్యపెడుతున్న ఎంపీ ధర్మపురి అర్వింద్, రాష్ట్ర బీజేపీ నేతల బండారం పార్లమెంట్సాక్షిగా బట్టబయలైంది.
వారివన్నీ బోగస్ హామీలని తేలిపోయింది. తెలంగాణలో పసుపుబోర్డు ఎప్పుడు ఏర్పాటు చేస్తారని టీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి రెండు వారాల క్రితం రాజ్యసభలో వేసిన ప్రశ్నకు.. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ నెల 12న కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం సోమవారం ఎంపీ సురేశ్రెడ్డి వద్దకు చేరింది. తెలంగాణలో పసుపుబోర్డు ఏర్పాటుచేసే ప్రతిపాదనలేదని ఆ లేఖలో కేంద్రమంత్రి స్పష్టంచేశారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ లో పసుపు పండుతున్నదని చెప్తూనే.. బోర్డుమాత్రం ఏర్పాటు చేయబోమన్నారు.
పసుపుతోపాటు హార్టికల్చర్ సాగులో సహాయం చేసేందుకు ఇప్పటికే అనేక పథకాలు అమలుచేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్యశాఖ ఇప్పటికే నిజామాబాద్లో స్పైసెస్ బోర్డు రీజినల్ కార్యాలయాన్ని ఏర్పాటుచేసిందని గుర్తుచేశారు. పసుపుతోపాటు ఇతర సుగంధ ద్రవ్యాల ఎగుమతికి ప్రచారంకోసం తెలంగాణలో వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం నగరాల్లో బోర్డు కార్యాలయాలు ఉన్నాయన్నారు.