ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం ఇటీవల విడుదలైన ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవని విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో ఆప్ అరవై రెండు స్థానాల్లో.. బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల దగ్గర నుండి ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని కొనసాగిస్తూ.. ఆ పార్టీ ప్రతిష్టను రోజురోజుకు దిగజార్చుకుంటుంది.
ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పీసీ చాకో తన పదవీకి రాజీనామా చేశారు. ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎవరనే అంశంపై అందరి చర్చలు జరుగుతున్నాయి.వరుస ఓటముల నుండి బయటకు వచ్చి గెలుపు తీరాలకు చేర్చడానికి ఆ పార్టీకి జాతీయ స్థాయిలో పూర్తి స్థాయి అధ్యక్షుడిని నియమించాలని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
దీంతో ఏప్రిల్ నెలలో జరగనున్న ఆ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో నిర్ణయం తీసుకోనున్నారని ఢిల్లీలో వార్తలు విన్పిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా గాంధీనే పూర్తి స్థాయి పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగిస్తారా లేదా భావి ప్రధానిగా భావిస్తున్న రాహుల్ గాంధీని నియమిస్తారా అనే అంశం తెలియాల్సి ఉంది.