మన భారతీయ సంస్కృతిలో సంప్రదాయాలకు, పూజలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. సాధారణంగా ఎవరైనా ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు మొదటగా వినాయకుని పూజ చేసి పనిలో ఎటువంటి విఘ్నలు కలగకుండా చూడమని ప్రార్థిస్తారు.వినాయక చవితి పండుగను జాతి, మతాలకు అతీతంగా అందరూ జరుపుకుంటారు.అయితే వినాయక చవితి కోసం వినాయకుడిని తీసుకొచ్చే సమయం అంటూ ఒకటి ఉంటుంది.ఆ సమయంలోనే గణేషుడిని తీసుకొస్తే మనకు మంచి జరుగుతుందని నమ్మకం.మరి గణేషుడిని తీసుకొచ్చే సమయం ఏమిటో వినాయకుడిని ఎలా పూజించాలో చూద్దామా.ప్రపంచ వ్యాప్తంగా ప్రాంతాన్ని బట్టి మహా గణపతి, హరిద్రా గణపతి, స్వర్ణ గణపతి, ఉచ్చిష్ట గణపతి, సంతాన గణపతి, నవనీత గణపతి అనే ఆరు రూపాల్లో పూజిస్తారు.
అలాగే 21 రకాల పత్రితో పూజ చేస్తారు.ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ 13 న వచ్చింది. వినాయకుని అనుగ్రహం పొందాలంటే పూజను ఈ విధంగా చేయాలి. వినాయకునికి సమర్పించే నైవేద్యంలో మోదకాలు, ఉండ్రాళ్ళు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.వినాయకునికి ఉండ్రాళ్ళు, మోదకాలు అంటే చాలా ప్రీతి. వినాయక పూజ చేయటం వలన చేసే పనిలో ఆటంకాలు తొలగిపోవటం, కార్య సిద్ది, జ్ఞానం వంటివి కలుగుతాయి. వినాయక పూజను మధ్యాహ్న సమయంలో చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఎందుకంటే వినాయకుడు మధ్యాహ్న సమయంలో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే వినాయకుని పూజను ఎట్టి పరిస్థితిలో సాయంత్రం చేయకూడదు.
ఎందుకంటే సాయంత్రం చేయటం వలన చంద్రుని కారణంగా దోషాలు ఏర్పడతాయి.వినాయక చవితి రోజు తెల్లవారు జామున నిద్ర లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపకు పసుపు రాసి బొట్లు పెట్టి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టాలి. షోడప ఆచార పూజలు చేయాలి. ఉపవాసం ఉండే వారు తప్పనిసరిగా దీపారాధన చేయాలి. మట్టి గణపతిని తెచ్చుకొని పువ్వులు, గంధం, కుంకుమతో అలంకారం చేయాలి. ఒక పీటపై తెల్లటి వస్త్రాన్ని వేసి బియ్యం పోసి దాని మీద మట్టి గణపతిని ఉంచి పూజ చేయాలి.ఇంట్లో విఘ్నేశ్వరుని పూజించేవారు ముందు రోజే విగ్రహాలను తీసుకురావాలి. అమృత ఘడియలు, శుభ కాలంలో వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకొస్తే మంచి జరుగుతుందని పండితులు పేర్కొంటున్నారు. సెప్టెంబరు 12 ఉదయం 11.03 నుంచి మధ్యాహ్నం 12.35, సాయంత్రం 5.09 నుంచి 6.40 గంటలు, రాత్రి 8 నుంచి 11 గంటల మధ్య శుభకాలం.
ఈ సమయంలో ప్రతిమలను ఇంటికి తీసుకురావాలట.సెప్టెంబరు 12 సాయంత్రం 4 గంటల తర్వాత చతుర్దశి ప్రారంభమై మర్నాడు అంటే సెప్టెంబరు 13 మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. అందుకే సెప్టెంబరు 13 ఉదయం నుంచే గణపతిని పూజించుకోవచ్చని చెబుతున్నారు. అయితే వినాయకుడు మధ్యాహ్న సమయంలో జన్మించటం వలన మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల మధ్య చేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.కాబట్టి ఈ సంవత్సరం వచ్చే వినాయకుడిని ఈ సమయంలో పైన చెప్పిన విధంగా పూజించి మీ అష్ట ఐశ్వర్యాలను పెంచుకోండి.