భారతీయ జనతా పార్టీ ఎంపీ బండారు దత్తాత్రేయ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీపై గౌరవం ఉన్న సంప్రదాయ ఓటు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్)కే పడిందన్నారు. ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేతలు నిర్వహించిన సుదీర్ఘ సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన దత్తాత్రేయ టీఆర్ఎస్ పార్టీ గెలుపు వెనుక పలు కారణాలు ఉన్నాయన్నారు.
తమ సమీక్షలో అభ్యర్థులు చాలా విషయాలు చెప్పారని దత్తాత్రేయ తెలిపారు. ప్రజా కూటమి, చంద్రబాబు ప్రచారంతో వచ్చిన తెలంగాణ రాష్ట్రం పోతుందేమోనని ప్రజలు భయపడ్డారన్న కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ అందుకే టీఆర్ఎస్కు ఓటువేశారని… బీజేపీపై గౌరవం ఉన్న సంప్రదాయ ఓటు కూడా ఆ పార్టీకే పడిందన్నారు. ఇక మా నేతల మధ్య సమన్వయ లోపం కూడా ఉందని అంగీకరించిన దత్తాత్రేయ… వాటన్నింటిని సరిదిద్దుకొని పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నామని.. ఇప్పటి పరిస్థితులకు పార్లమెంట్ ఎన్నికలకు చాలా తేడా ఉంటుందన్నారు.