గత నాలుగేళ్లుగా టీడీపీ ప్రభుత్వం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎన్ని అవరోధాలు సృష్టించినా, చివరకు భౌతికంగా అంతం చేసేందుకు హత్యయత్నానికి పాల్పడినా చలించకుండా ఆయన దిగ్విజయంగా తన పాదయాత్రను పూర్తి చేసారని ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం అన్నారు. జగన్పై భౌతిక దాడి ఫలించకపోవడంతో ఇప్పుడు ఆధ్యాత్మిక దాడి చేసేందుకు చంద్రబాబు కుట్రపన్నారని అన్నారు. జగన్ పాదయాత్రకు సహకరించిన వారందరకీ కృతజ్ఞతలు తెలిపారు. రేపటితో పాదయాత్ర ముగుస్తుందని, ఈ సందర్భంగా ఇచ్చాపురం పాత బస్టాండ్ సెంటర్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశామని, గొప్ప సంకల్పంతో వైయస్ జగన్ పాదయాత్ర చేశారని చెప్పారు.
జగన్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని, తిరుమల దర్శనం సందర్భంగా చంద్రబాబే టీడీపీ కార్యకర్తల చేత హడావిడి చేయించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. గతంలో ఇలాగే వ్యవహరించారని, ఇప్పుడు కూడా అదేవిధంగా దుశ్చర్యలు చేయబోతున్నారని దీనిపై తమకు సమాచారం ఉందన్నారు. స్వామి వారిని కూడా రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం మంచిది కాదని విమర్శించారు. యాత్ర అనంతరం జగన్ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారని, ఇదే అదనుగా జగన్ పై దుష్ప్రచారం చేయించేందుకు స్కెచ్ వేసారని తెలిపారు. దేవదర్శనం సమయంలో జై జగన్ నినాదాలు చేసేందుకు టీడీపీ కార్యకర్తలు రంగంలోకి దింపారని, జగన్పై భౌతిక దాడి ఫలించకపోవడంతో ఇప్పుడు ఆధ్యాత్మిక దాడికి తెగించారని, ప్రజలే వీటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వైసీపీ నాయకులు కార్యకర్తలంతా ఎంతో సమయమనం పాటించాలని పిలుపునిచ్చారు.