స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రతిపక్ష టీడీపీ నుంచి అధికార వైసీపీలోకి వలసలు షురూ అయ్యాయి. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేతలు డొక్కా మాణిక్య వర ప్రసాద్రావు, రెహమాన్, రామసుబ్బారెడ్డి, ఆయన కొడుకు, సోదరుడు, కదిరి బాబురావు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఆయన తనయుడు కరణం వెంకటేష్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇక పులివెందుల టీడీపీ ఇన్చార్జి సతీష్కుమార్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో ఆయన కూడా వైసీపీలో చేరనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు తీరుతో విసిగిపోయిన టీడీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీలో చేరుతున్నారు. దీంతో వలసలను ఎలా ఆపాలో తెలియక చంద్రబాబు తలపట్టుకుంటున్నాడు. వైసీపీ బెదిరించి, డబ్బులతో ప్రలోభపెట్టి తమ పార్టీ నేతలను లాక్కుంటుందని చంద్రబాబు ఆరోపిస్తున్నాడు. అయితే మీకు లాగా వందల కోట్లు, కాంట్రాక్టులు ఇచ్చి, మంత్రి పదవుల ఆశ పెట్టి 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కున్నట్లు జగన్ చేయడం లేదు…ఏ టీడీపీ ఎమ్మెల్యే అయినా తన పార్టీలో చేరాలంటే ముందుగా తన పదవికి రాజీనామా చేయాలని చెబుతున్నాడు. వచ్చిన నేతలంతా స్వచ్చందంగా చేరుతున్నారే తప్పా..వారికి నీకులాగా డబ్బులు, పదవుల ఆశ పెట్టలేదంటూ వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. రామసుబ్బారెడ్డి కూడా తాను భయపడి పార్టీలో చేరడం లేదని, నన్ను ఎవరూ భయపెట్టలేదని, సీఎం జగన్ పాలన నచ్చి చేరుతున్నట్లు చంద్రబాబు విమర్శలకు కౌంటర్ ఇచ్చాడు.
అయితే తాజాగా వలసలపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. టీడీపీ నుండి వైసీపీలోకి స్వచ్చందంగా వచ్చి చేరే వారు చాలా మంది ఉన్నారని, ఇప్పటికీ 13 నుండి 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని సజ్జల షాకింగ్ న్యూస్ చెప్పారు. చంద్రబాబు, లోకేష్ల తీరు నచ్చక చాలా మంది టీడీపీని వీడటానికి సిద్ధంగా ఉన్నారని సజ్జల చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలను మేం ఆహ్వానించకున్నా వారంతట వారే వస్తున్నారని సజ్జల అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ మీద ఆ పార్టీ నేతలకే నమ్మకం కలగడం లేదని, ఇప్పుడున్న టీడీపీ ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ కాదని, అందుకే అందరూ పార్టీకి గుడ్ బై చెప్పాలని భావిస్తున్నారని చెప్పి బాంబ్ పేల్చారు. రానున్న రోజుల్లో మరిన్ని వలసలు తమ పార్టీలోకి కొనసాగుతాయని సజ్జల పేర్కొన్నారు. దీంతో చంద్రబాబు ఆందోళనలో పడ్డాడు. వైసీపీ నేతలతో టచ్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలపై ఆరా తీయిస్తున్నాడు. మొత్తంగా టీడీపీ నుంచి వైసీపీలోకి ప్రారంభమైన వలసలు ఇంకా కొనసాగుతాయని, ఆఖరకి పార్టీలో చంద్రబాబు, లోకేష్, బాలయ్యతో పాటు ఇంకో నలుగురైదుగురు ఎమ్మెల్యేలే మిగులుతారని టీడీపీలో చర్చ జరుగుతోంది.