చైనా తర్వాత కరోనా వైరస్ అధికంగా ప్రభావం చూపెట్టిన దేశాల్లో దక్షిణ కొరియా ప్రధానంగా నిలిచింది. కాకపోతే, ఈ దేశం కరోనా మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోగలిగింది. ఇందుకు కారణం దక్షిణ కొరియా సాంకేతిక పరిజ్జానాన్ని విరివిగా వినియోగించుకోవడమే. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటాల సాయంతో వైరస్ ను పూర్తి స్థాయిలో కట్టడి చేసింది. కరోనా బాధితులు నివసిస్తున్న ప్రాంతాలు, సంచరించిన ఏరియాలు, మరణాను బిగ్ డేటా సాయంతో ప్రకటిస్తుండటం గమనార్హం.
బాధితుల పేర్లు, వారి వ్యక్తిగత వివరాలను ఎక్కడా ప్రకటించకుండా ప్రత్యేకంగా వారికి ఒక్కో నెంబరును కేటాయిస్తున్నారు. అక్కడ సాంకేతిక పరిజ్జానం ఎంత అడ్వాన్సుగా ఉందంటే, కరోనా బాధితుడు ఎవరితో కలిసి సినిమా థియేటర్కు వెళ్లాడు? ఏయే వాహనంలో ప్రయాణించాడు? భోజనం తిన్న రెస్టారెంట్, ప్రయాణం చేసిన లోకల్ రైలు, బోగి నెంబరు, కలిసిన వ్యక్తులు, సమావేశ స్థలాలు, ఎవరెవరి ఇంటికెళ్లారు? వంటి విషయాలన్నీ తెలియజేయడానికి ప్రత్యేకంగా ఒక వెబ్ సైటు అక్కడ ఏర్పాటు చేశారు.
గవర్నమెంట్ అందజేసే వివరాల ప్రకారమే అది పని చేస్తుంది. దీని సాయంతో కరోనా ఎక్కువగా కనిపించని చోట్లకు వెళ్లకుండా అక్కడి ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ట్విట్వర్, వాట్సప్, ఫేస్ బుక్, సెల్ ఫోన్ కాల్ డేటా, జీపీఎస్ సమాచారాలతో ప్రత్యేకంగా యాప్ లను రూపొందించారు. వీటి సాయంతో వ్యాధి విస్తరించిన ఏరియాలను, రోగుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నారు. ఫలితంగా, బయట ఏం జరుగుతుందనే విషయాన్ని కొరియా ప్రజలు సులువుగా తెలుసుకోగలిగారు. ఇంట్లోనే భయంతో కూర్చోవడం కంటే ఏయే ఏరియాలకు వెళ్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలో తెలుసుకుంటున్నారు. దీంతో, వైద్య సదుపాయాలను అప్రమత్తం చేసి, తక్షణమే వైద్య సేవలను అందించడానికి తోడ్పడింది.