ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు ఔషధం సిద్ధమైంది. భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్ మార్క్ కరోనా నివారణ మందును ఆవిష్కరించినట్టు వెల్లడించింది. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. ఫవిపిరవిర్, ఉమిఫెనోవిర్ అనే రెండు యాంటీ వైరస్ ఔషధాలపై అధ్యయనం చేసిన గ్లెన్మార్క్ ఫవిపిరవిర్ ఔషధం కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న వారిపై బాగా పనిచేస్తోందని వెల్లడించింది. ఫాబిఫ్లూ బ్రాండ్ పేరిట ఈ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు అవసరమైన అనుమతులను శుక్రవారం భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి పొందినట్టు వెల్లడించింది.
ధర ఎంతంటే?
దేశవ్యాప్తంగా సాధ్యమైనంత త్వరగా ఈ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తమ సంస్థ కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని గ్లెన్మార్క్ ఛైర్మన్ గ్లెన్ సల్దన్హా అన్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే ఈ ఔషధాన్ని విక్రయించనున్నట్టు తెలిపారు. అలాగే, ఒక్కో మాత్ర ధర రూ.103గా ఉంటుందని వెల్లడించారు. కరోనా బారిన పడినవారు 1800 ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను తొలి రోజు రెండు సార్లు వేసుకోవాలనీ.. ఆ తర్వాత వరుసగా 14 రోజుల పాటు 800 ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను రోజుకు రెండుసార్లు చొప్పున వాడాలని సూచించారు.
Post Views: 475