హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఐటీ పరిశ్రమ క్రమంగా జిల్లాలకు విస్తరిస్తున్నది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐటీ టవర్ను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలనే లక్ష్యంతో ఐటీ హబ్లో భాగంగా అత్యాధునిక హంగులతో ఈ ఐటీ సౌధాన్ని నిర్మించారు. 42 వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఐదు అంతస్థుల్లో ఉన్న ఈ టవర్ను రూ.27 కోట్ల వ్యయంతో నిర్మించారు. రెండేండ్లలోనే దీన్ని పూర్తి చేయడం విశేషం.
ఇప్పటికే 16 కంపెనీలు ఈ ఐటీ టవర్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. ఇవన్నీ ఆస్ర్టేలియా, అమెరికాకు చెందిన కంపెనీలు కావడం మరో విశేషం. ప్రస్తుతం 430 మందిని నియమించుకున్నారు.
త్వరలో మరో 430 మందిని నియమించుకోనున్నారు. దీంతో రెండు షిప్టుల్లో 860 మంది పనిచేయనున్నారు. ఖమ్మం ఐటీ టర్నోవర్ 50 లక్షల నుంచి 5 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఐటీ రంగం విస్తరణతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి.