తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ వచ్చిందని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలో సీతారాంపురం కాలనీలో రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవస్థానం (గీతా మందిర్) ప్రతిష్ట కార్యక్రమ కరపత్రాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం లక్షరూపాయల విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేసారు. అనంతరం భాస్కర్ రావు మాట్లాడారు. సనాతన హిందూ ధర్మరక్ష పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి కోసం, పునర్నిర్మాణం కోసం టీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలోని 4,805 ఆలయాల ధూప, దీప, నైవేధ్యాల కోసం ప్రభుత్వం ప్రతి దేవాలయానికి రూ.6వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లించి ఆదుకుంటున్నదని అన్నారు.
దీనిలో రూ.2వేలు నిత్య పూజల కోసం, రూ.4 వేలు అర్చకుల కోసం ప్రభుత్వం కేటాయిస్తోందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆలయాలకు పునర్వైభవం వచ్చిందన్నారు. తొలుత 3వేల దేవాలయాలకు ధూప,దీప, నైవేధ్యాల కోసం నిధులను కేటాయించిన ప్రభుత్వం క్రమంగా జీవో నెంబర్ 248 ద్వారా 2017, నవంబర్8 నుంచి 4,805 దేవాలయాలకు వర్తింపజేసిందన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.25 కోట్లు కేటాయిస్తోందన్నారు. రాష్ట్రంలోని దేవాలయాలు సీఎం కేసీఆర్ కృషితో ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ పున:నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను, కామన్ గుడ్ ఫండ్ నిధులతో ఇతర ఆలయాల జీర్ణోద్ధరణ, దేవాలయాల నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాలకు నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి చేస్తున్నదని చెప్పారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో, అభివృద్ధిలో అగ్రపథంలో నడిపిస్తున్నామని భాస్కర్ రావు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బండారు కుశలయ్య, ఉపాధ్యక్షులు చీదెళ్ళ వెంకటేశ్వర్లు, గోళ్ళ వేణు, బొగ్గారపు మట్టయ్య, ప్రధాన కార్యదర్శి గోళ్ళ వెంకట దుర్గాప్రసాద్, కోశాధికారి వీరబోమ్మల యాదగిరి, తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కర్నాటి రమేశ్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, రేపాల రమేశ్, వెంకటరమణచౌదరి, కౌన్సిలర్లు చీదెళ్ళ సత్యవేణి, సాదేఖ బేగం-ఖాదర్, రాయపూడి భవాని, పగిడిమర్రి సురేశ్, పేరూరి రమేశ్, కృష్ణమూర్తి, శ్రీనివాస్, నీలా రామారావు, గండె రాము, తదితరులు పాల్గొన్నారు.