కోనసీమలో క్రాప్ హాలిడే పేరుతో రైతుల్ని కొందరు రెచ్చగొడుతున్నారని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. గతంలో ధాన్యం బకాయిలు ఎగ్గొట్టినందుకా? ఆ బకాయిలను వైసీపీ ప్రభుత్వం తీర్చినందుకా? ఎందుకు క్రాప్ హాలిడే అని ప్రశ్నించారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో పంటల బీమా పథకం కింద రూ.2,977కోట్ల పరిహారాన్ని రైతుల ఖాతాల్లో సీఎం జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
రైతులకు మేలు చేసే విషయంలో దేశంతో పోటీపడుతున్నామని జగన్ అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో రైతుల కోసం రూ.1.28లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడితే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని.. దళిత మంత్రి, బీసీ ఎమ్మెల్యే ఇళ్లను తగులబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం విపక్షాలకు నచ్చడం లేదన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సాయం అందని కుటుంబం ఒక్కటైనా ఉందా? అని జగన్ సవాల్ విసిరారు.