తెలంగాణకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిలదీశారు. 8 ఏళ్ల కేసీఆర్, మోడీ పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని కోరారు. కల్వకుర్తికి చెందిన పలువురు ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారు.. రెండు రోజులు లొల్లి పెట్టి వెళ్లిపోతారని బీజేపీ జాతీయ నేతలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. వాళ్లకు తెలిసిందల్లా అబద్ధాలు చెప్పడమేనన్నారు. గ్యాస్ సిలిండర్ ధర రూ. 400 ఉంటే మోడీ గగ్గోలు పెట్టేశారని.. ఇప్పుడు రూ.1050కి చేరిందని గుర్తుచేశారు.
బ్లాక్ మనీ తెచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ.15లక్షలు వేస్తామంటూ అధికారంలోకి వచ్చారని.. అలా వేశారా? అని కేటీఆర్ నిలదీశారు. యువతకు 2 కోట్ల ఉద్యోగాల పేరుతో మోసం చేశారని విమర్శించారు. వీటిన్నింటిపై తెలంగాణ ప్రజలు బీజేపీ నేతలను నిలదీయాలన్నారు. తాము చేసిన అభివృద్ధి పనులు వంద చెబుతామని.. కేంద్రం తెలంగాణకు చేసిన మంచి ఏంటో ఒక్కటి చెప్పాలని సవాల్ విసిరారు.