హైదరాబాద్లో మరో రెండు రోజుల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనుండగా రాష్ట్రంలో ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ పరిధిలోని నలుగురు బీజేపీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపాలిటీలోని బీజేపీ ఫ్లోర్ లీడర్, కౌన్సిలర్ టీఆర్ఎస్లో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో వారంతా గులాబీ కండువా కప్పుకొన్నారు.
టీఆర్ఎస్లో చేరిన వారిలో హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్, రాజేంద్రనగర్ కార్పొరేటర్ అర్చన ప్రకాష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెంకటేశ్, అడిక్మెట్ కార్పొరేటర్ సునీత ప్రకాష్ గౌడ్, తాండూరు మున్సిపాలిటీ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజా గౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్ ఉన్నారు.
ఇటీవలే జీహెచ్ఎంసీలోని బీజేపీ కార్పొరేటర్లతో ఢిల్లీలో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం మరో 24 గంటల్లో ప్రధాని రాష్ట్రానికి రానుండగా అదే పార్టీకి చెందిన కార్పొరేటర్లు టీఆర్ఎస్లో చేరడం గమనార్హం. ఈ చేరికల కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, పైలెట్ రోహిత్రెడ్డి, సుధీర్రెడ్డి ఉన్నారు.