మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ముగిసిపోయిందనుకున్న దానికి సంబంధించిన మరికొన్ని రాజకీయ ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. గువహటిలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని రెబెల్ గ్రూపులోకి రావాలని తనకూ ఆఫర్ ఇచ్చినా తాను తిరస్కరించానని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు.
తాను బాలాసాహెబ్ ఠాక్రే అనుయాయుడని చెబుతూ ఆ ప్రతిపాదనను తోసిపుచ్చానని చెప్పారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని అందుకే తాను ఈడీ ఎదుట ఆత్మవిశ్వాసంతో విచారణకు హాజరయ్యానని రౌత్ పేర్కొన్నారు.నిజం మనవైపున ఉంటే భయం ఎందుకని ప్రశ్నించారు.
ఏక్నాథ్ షిండే శివసేన సీఎం కాదని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టంగా చెప్పారని అన్నారు. ముంబైలో శివసేన ఉనికిని తగ్గించేందుకే తమ పార్టీని దెబ్బతీయాలని కాషాయ పార్టీ వ్యూహంలో భాగంగా ఇదంతా జరిగిందని షిండే తిరుగుబాటును ఉద్దేశించి రౌత్ అన్నారు. శుక్రవారం జరిగిన శివసేన ఎంపీల సమావేశానికి 18 మంది ఎంపీలకు గాను 15 మంది హాజరయ్యారని చెప్పారు.