తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు పొడిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమ, మంగళ, బుధవారాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. నేటితో సెలవులు ముగుస్తున్నాయి.
కానీ రాష్ట్రంలో వర్షాలు ఏ మాత్రం తగ్గలేదు. అన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో మూడు రోజులు విద్యాసంస్థలకు సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురు, శుక్ర, శనివారాల్లో కూడా విద్యాసంస్థలు బంద్ కానున్నాయి.
తిరిగి సోమవారం విద్యాసంస్థలు పున:ప్రారంభం కానున్నాయి. మరో వైపు రేపటి నుంచి ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విస్తారంగా వర్షాలు కురవడంతో రేపు, ఎల్లుండి జరగాల్సిన అగ్రికల్చర్ పరీక్షలు వాయిదా వేసినట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఇంజనీరింగ్ పరీక్షలు మాత్రం యథాతథం జరుగుతాయని పేర్కొంది.