ఇటీవల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేతృత్వంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా దేశ వ్యాప్తంగా భారతీయులందరూ తమ తమ ఇండ్ల వద్ద జాతీయ పతాకాలు ఎగురవేసిన సంగతి విదితమే.ఈ క్రమంలో జాతీయ జెండాతో దిగిన సెల్ఫీ ఫొటోలను ‘హర్ ఘర్ తిరంగా’ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీ యావత్ భారతవానికి పిలుపునిచ్చారు..ప్రధాని పిలుపునందుకుని దేశంలో కోట్లాది మంది భారతీయులు తమ సెల్ఫీ ఫొటోలను ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. లొకేషన్ను జియోట్యాగ్ చేస్తూ ఫోన్ నంబర్ తదితర వివరాలను సమర్పించారు. అయితే, ఇప్పుడు ఆ పౌరుల వ్యక్తిగత సమాచార గోప్యతపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు నాన్-ప్రాఫిట్ జర్నలిజం ఆర్గనైజేషన్ ‘రెస్ట్ ఆఫ్ వరల్డ్’ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది.
వీటికి సమాధానమేది?
–> ‘హర్ ఘర్ తిరంగా’ వెబ్సైట్ను కేంద్ర సాంస్కృతిక శాఖ లాంచ్ చేసింది. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే అన్ని వెబ్సైట్ల సర్వర్లన్నీ ఎన్ఐసీ.ఇన్ పేరిట భారత్లోనే ఉంటాయి. అయితే, ఈ సైట్ హోస్టింగ్ సర్వర్ ప్రైవేట్ సంస్థ అమెజాన్ వెబ్ సర్వర్ పేరిట ఉన్నది. ఎందుకు?
–> ‘హర్ ఘర్ తిరంగా’ సైట్ కార్యకలాపాలను గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న ‘తగ్బిన్’ అనే ప్రైవేట్ కంపెనీ నిర్వహిస్తున్నది. సింగపూర్, దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న మరికొన్ని కంపెనీలు ఈ వెబ్సైట్ బ్యాక్ఎండ్కు అనుసంధానమై ఉన్నాయి. ప్రజల సమాచారాన్ని ప్రైవేట్ కంపెనీకి ఎందుకు అప్పగించారు?
–> ఆగస్టు 15 తర్వాత ప్రచారం ముగియగానే సైట్లోని డాటాను తొలగిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అయితే, ఇప్పటికీ ఆరు కోట్ల మంది వివరాలు, ఫొటోలు సైట్లో కనిపిస్తూనే ఉన్నాయి. వారి ఫోన్ నంబర్లు, లొకేషన్లు సర్వర్లలో నిక్షిప్తమై ఉన్నాయి. ఏ ప్రయోజనాలను ఆశించి ఇంకా ఆ డాటాను స్టోర్ చేస్తున్నారు?
–> ‘హర్ ఘర్ తిరంగా’ వెబ్సైట్ ఐపీ అడ్రస్ను 15 ఇతర వెబ్సైట్లకు షేర్ చేశారు. ఇందులో విదేశాలకు చెందిన వెబ్సైట్లు కూడా ఉన్నాయి. భారత వెబ్సైట్ ఐపీ అడ్రస్ను.. విదేశీ వెబ్సైట్లకు ప్రత్యేకంగా షేర్ చేయడం ఎందుకు?
–> 18 ఏండ్లు నిండని మైనర్ల వివరాలు, ఫొటోలను ప్రచురించబోమని పేర్కొన్నారు. కానీ, ఆ వెబ్సైట్లో చిన్నారుల ఫొటోలు, పేర్లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. వాటిని ఇంకా ఎందుకు తొలగించలేదు?