ప్రస్తుతం దేశంలో మూడో జాతీయ పార్టీకి చోటు ఉన్నదా? ఉంటే దానిని బీఆర్ఎస్ భర్తీ చేయగలదా? తెలంగాణ ముద్ర గల కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించగలరా? అంటూ సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ను ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 140 కోట్ల జనాభా ఉన్న సువిశాల భారతదేశంలో ఉన్నది రెండే జాతీయ పార్టీలు. ఇందులో ఒకటి కనుమరుగయ్యే దుస్థితికి చేరిపోగా.. మరో పార్టీ మతముద్ర వేసుకొని ఒకే వర్గానికి పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో మూడో జాతీయ పార్టీ కోసం దేశం ఎదురు చూస్తున్నదని మేధావులు అంటున్నారు. దేశంలో పరిస్థితులు మారాలన్నా, సమస్యలు తీరాలన్నా మరో జాతీయ పార్టీ అనివార్యమనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
చుక్కానిలా బీఆర్ఎస్
ప్రస్తుతం దేశం సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఉన్నది. నిరుద్యోగం, పేదరికం, అప్పులు, మత విద్వేషాలు వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నది. అ పరిస్థితుల్లో దేశ ప్రజలకు కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ చుక్కానిలా కనిపిస్తున్నది. ఇది ఆషామాషీగా ఏర్పాటుచేసిన పార్టీ కాదు. ప్రజలు, రైతుల సమస్యల పరిష్కారమే ఎజెండాగా ఆర్థిక, రాజకీయ మేధావులతో చర్చలు, రైతు సంఘాల నేతలతో మేధోమథనం తర్వాత ఏర్పాటుచేశారు. అందుకే దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ సంచలనంగా మారింది.
జాతీయ స్థాయిలో కేసీఆర్ ఖ్యాతి
కేసీఆర్కు జాతీయస్థాయిలో గుర్తింపు లభిస్తుందా? ఆయనపై ఉన్న తెలంగాణ ముద్ర వీడుతుందా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ సీఎం కావొచ్చు.. కానీ ఆయన ఎప్పుడో జాతీయ నేతగా గుర్తింపు పొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని రాష్ర్టాలు తిరిగి, అన్ని పార్టీలతో చర్చలు జరిపి వారందర్నీ ఏకం చేసిన చరిత్ర కేసీఆర్ది. కేంద్రంలో మంత్రిగానూ సేవలందించారు. దీనికి తోడు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగల చాతుర్యం, అందర్నీ ఏకం చేసే రాజకీయ చతురత ఆయన సొంతం. ప్రస్తుతం దేశం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నది? వాటికి పరిష్కారం ఏమిటనేదానిపై స్పష్టత ఉన్న నేత కేసీఆర్. వ్యవసాయం, సాగునీరు, విద్యుత్తు, ఆర్థికం ఇలా అన్ని అంశాల్లోనూ సమస్యలకు పరిష్కారాలు చూపారు. తెలంగాణ ముద్ర మరింత అనుకూలం. తెలంగాణ మాడల్ను దేశవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్లున్న నేపథ్యంలో ఆయనకది మరింత బలం పెంచుతుందే తప్ప… ఆటంకం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత ప్రధాని మోదీ ఒకప్పుడు గుజరాత్ సీఎంగా పనిచేశారు. జాతీయస్థాయి ఆలోచనలున్న నేత ఎక్కడున్నా.. జాతీయ రాజకీయాలు పెద్ద ఇబ్బందేమీ కావని మేధావులు అంటున్నారు. వీటన్నింటికి తోడు హిందీ, ఇంగ్లిష్పై పట్టుండటం కేసీఆర్ జాతీయ నేతగా రాణించేందుకు ఉపయోగపడుతుందని చెప్తున్నారు.
దక్షిణాది నుంచి ఒక్కటే
స్పెషల్టాస్క్బ్యూరో, నమస్తే తెలంగాణ: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో స్వతంత్ర పార్టీ మినహా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి పెద్దగా ప్రభావితం చేసిన దక్షిణాది పార్టీ ఇప్పటివరకు లేదు. నెహ్రూ నాయకత్వంతో విభేదించి సీ రాజగోపాలాచారి, ఎన్జీ రంగా వంటి నేతలు స్వతంత్ర పార్టీని ఏపీలో స్థాపించారు. ఆ ఒక్క పార్టీ తప్ప జాతీయస్థాయికి ఎదిగిన దక్షిణాది పార్టీలు లేవు. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ జాతీయ పార్టీలుగా ప్రకటించుకున్నపటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలుగు మాట్లాడే (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) రాష్ర్టాలకే అవి పరిమితమయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో వాటి ఉనికి ప్రశ్నార్థకమే. అవి జాతీయ పార్టీల హోదా కూడా పొందలేకపోయాయి. తమిళనాడుకు చెందిన డీఎంకే, ఏఐఏడీఎంకే తమిళనాడు, పాండిచ్చేరికే పరిమితం. ఇప్పుడు టీఆర్ఎస్ ఒక్కటే దక్షిణాది రాజకీయ పార్టీల చరిత్రను తిరగరాస్తూ జాతీయ పార్టీగా అవతరించబోతున్నది.