ఏపీ మాజీసీఎం చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోగానే మళ్ళీ కార్యకర్తలే నాకు సర్వస్వం అనే పాత పాట మొదలుపెట్టారు. 1995 నుండి 2004 వరకు అధికారంలో ఉన్నపుడు తొమ్మిదేళ్లపాటు చంద్రబాబు కార్యకర్తలకు చేసిందేమి లేదు.. అధికారులు, ఐటి, నేనే అభివృద్ధి చేస్తానంటూ కార్యకర్తలను నిర్లక్ష్యం చేసి 2004లో ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్నారు. 2004లో ఓడిపోయిన చంద్రబాబు మళ్లీ కార్యకర్తలే నాకు బలం, ధైర్యం అన్నారు. మళ్లీ 2004 నుండి 2014 వరకు కార్యకర్తలు పార్టీకి అండగా నిలబడ్డారు. అలాగే టీడీపీ కార్యకర్తల పదేళ్ల శ్రమ ఫలించి 2014లో అధికారం లోకి రాగానే నూతన రాష్ట్రాభివృద్ధి పేరుతో కార్యకర్తలకు పక్కన పెట్టి చంద్రబాబు వారికి దూరమయ్యారు. ఇప్పుడు దారుణంగా మళ్లీ ఓడిపోయాక కార్యకర్తలే నాకు ముఖ్యం అంటున్నారు. వారు కష్టించి పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడం చంద్రబాబు అందలమెక్కి అధికారాన్ని తాను, తన చుట్టూ ఉండే బినామాలకు దోచిపెట్టడం జరుగుతుందనేది సగటు టీడీపీ కార్యకర్త ఆవేదన.
దీంతో బాబుగారికి అధికారం ఉన్నప్పుడు మనం గుర్తుకు రాము.. ఆయన కోటరీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు తప్ప నిజంగా క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలను కలుసుకోరు.. ఇప్పుడు మాత్రం మనం కావాలని సామాన్య కార్యకర్తలు విసుక్కుంటున్నారు. ఓడిపోయి ఉన్నపుడు మాత్రమే ఆయనకు కార్యకర్తలు గుర్తుకు వస్తారా.? అని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని పట్టించుకోని అధినేతకు ఇప్పుడెందుకు అండగా నిలవాలని ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి రాగానే అన్ని మరిచిపోయి ఐదేళ్లు అధికారంలో ఉండి కనీసం నామినేటెడ్ పదవులను కూడా భర్తీ చేయకుండా కాలాన్ని గడిపేసిన చంద్రబాబు మాటలను ఎలా నమ్మాలని అడుగుతున్నారు. ప్రాణాలు కూడా లెక్క చేయకుండా కష్ట పడుతున్న కార్యకర్తలకు ఇచ్చిన మాటపై జీవితంలో ఒక్కసారైనా నిలబడాలని కోరుతున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా దీనిని పార్టీకి అత్యంత ప్రమాదకరమైన పరిణామంగా చూస్తున్నారు.