ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? తనదైన శైలిలో పరిపాలన చేస్తున్న జగన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు మరో మాస్టర్ స్ట్రోక్ ఇవ్వనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రభుత్వ పథకాల విషయంలో.. రాష్ట్రం అభివృద్ది దిశగా ముందుకు వెళ్లడానికి తీసుకునే నిర్ణయాల విషయంలో..రాజకీయాలు, పార్టీలు, కులాలు, ప్రాంతాలు, మతాలు చూడనని జగన్ అసెంబ్లీలోనే ప్రకటించేశారు. ఇదే ఒరవడిలో సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ విసృత చర్చ నడుస్తోంది. ఏపీ ప్రభుత్వ టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా ఎన్టీఆర్ నియామకం కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగుదేశం పార్టీతో ఎన్టీఆర్కు పెద్దగా సత్సంబంధాలు లేని సంగతి తెలిసిందే. తెలంగాణ ఎన్నికల్లో కూకట్పల్లి నుంచి తన సోదరి సుహాసినిని బరిలో దిగినపుడు ఈ విషయం స్పష్టమైంది. ఈ పోటీ సమయంలో ఎన్టీఆర్ ప్రచారం చేయలేదు. తమ సోదరికి మద్దతు ఇవ్వమని మాత్రమే ఎన్టీఆర్ ప్రజలను ఉద్దేశించి ఒక లెటర్ విడుదల చేశారు. ఇక ఏపీ ఎన్నికల్లో టీడీపీకి ఆమడదూరంలో ఉండిపోయాడు తారక్. పార్టీ నుంచి కూడా ఆయనకు పిలుపు అందలేదు. ఈ నేపథ్యంలో సీఎం జగన్..ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసీడర్గా నియమించాలని భావిస్తే..ఎన్టీఆర్ ఆ నిర్ణయానికి సమ్మతిస్తే..రాష్ట్ర రాజకీయాల్లో ఈ నియామకం పెద్ద సంచలనమే అవుతుంది.
ఈ మేరకు పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు. ఎన్టీఆర్కు అతి సన్నిహితంగా ఉండే మంత్రి కొడాలి నాని, ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారి ద్వారానే ఈ ప్రపోజల్ ముందుకు వచ్చిందని సమాచారం. త్వరలో ఈ మేరకు ప్రకటన రావచ్చని కొందరు అంచనా వేస్తున్నారు.