ప్రపంచంలో అనేకదేశాల్లో ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతుండటంతో వాతావరణ కాలుష్యం, భూతాపంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.
ప్రపంచమంతా ఒప్పుకొంటే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏడాదికి కనీసం పదిరోజులపాటు పరిమితస్థాయిలో లాక్డౌన్ ప్రకటిస్తే బాగుంటుందని వినూత్న ప్రతిపాదన చేశారు. కరోనా వ్యాప్తిని కట్టడిచేసేందుకు లాక్డౌన్ను మరికొంతకాలం కొనసాగించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని, అయితే దీనిపై సమిష్టిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని తెలిపారు.
కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డాక దేశాలన్నీ వైద్య,మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఐటీ రంగం తర్వాత లైఫ్ సైన్సెస్ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 9.30 వరకు ట్విట్టర్లో ఆస్క్కేటీఆర్ ట్యాగ్లో అందుబాటులోఉన్న ఆయన పలువురి ప్రశ్నలకు సమాధానమిచ్చారు.