కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులపై రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. అన్నీ కేంద్రం చేతుల్లో పెట్టుకుని రాష్ర్టాలపై ఆరోపణలు చేయడం సరికాదు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలించి మాట్లాడితే బాగుంటుంది. తెలంగాణలో 4 రాష్ర్టాలకు చెందిన రోగులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మేం కేంద్రాన్ని విమర్శించట్లేదు.. వారే విమర్శిస్తున్నారు. కరోనా కట్టడిలో దేశంలోనే సమర్థంగా వ్యవహరిస్తున్న రాష్ర్టం తెలంగాణ అని స్పష్టం చేశారు. సాయం చేసే స్థితి నుంచి చిన్న దేశాల సాయం పొందే పరిస్థితి భారత్కు వచ్చిందని ఈటల రాజేందర్ అన్నారు.
ఆక్సిజన్ లేక చనిపోవడం దేశానికే అవమానకరం:
కరోనా రోగులు సరిపడా ఆక్సిజన్ లేక చనిపోవడం దేశానికి అవమానకరం అని మంత్రి ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంటుంది. అవసరమైన ఆక్సిజన్ను కేంద్రం యుద్ధ ప్రతిపాదికన సరఫరా చేయాలన్నారు. తెలంగాణకు 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కావాలని కోరాం. కానీ రాష్ర్టానికి 306 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను మాత్రమే కేటాయించింది. రాష్ర్టానికి దగ్గర ప్రాంతాల నుంచి ఆక్సిజన్ ఇవ్వాలని కోరినప్పటికీ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రాష్ర్టాల నుంచి ఆక్సిజన్ ను కేటాయించారు.
కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలి:
కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని మంత్రి ఈటల డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తి యుద్ధ ప్రతిపాదికన పెరగాలి. వ్యాక్సిన్ లేకపోతే గందరగోళమవుతుందని అధికారులు చెప్తున్నారు. రాష్ర్టంలో 18-44 ఏండ్ల మధ్య వారికి 3.5 కోట్ల టీకాలు కావాలి. రెండు కంపెనీల ఉత్పత్తి 6 కోట్లే అంటున్నారు. వ్యాక్సిన్ విషయంలో కేంద్రం స్పష్టమైన ప్రణాళికను ప్రకటించాలి అని ఈటల డిమాండ్ చేశారు.
రాష్ర్టాలను తప్పబడుతున్న కేంద్రం ఏం చేసింది?:
రెమ్డెసివివర్ తక్కువకు తయారు చేసి ఎక్కువకు అమ్ముతున్నారు. దీనిపై కేంద్రం దృష్టి సారించి రెమ్డెసివిర్ లాంటి ఔషధాల ఉత్పత్తి పెంచాలి. కేంద్రం నియంత్రణ చేయడం కాదు.. సరిపడా డోసులు పంపాలన్నారు. ఔషధాలు బ్లాక్ మార్కెట్కు పోకుండా చూడాలన్నారు. కరోనా టెస్టింగ్ కిట్ల ధరలు కూడా పెంచారు. కేంద్రానికి అన్నింటిపైనా నియంత్రణ ఉండాలి. కరోనా కట్టడిలో రాష్ర్టాలను తప్పుబడుతున్న కేంద్రం ఏం చేసింది? అని ప్రశ్నించారు. 3.5 కోట్ల టీకాలు 3 నెలల్లో ఇవ్వాలని అనుకుంటున్నాం. దిగుమతి చేసుకునేందుకు కేంద్రం అనుమతి ఇస్తుందా? అని అడిగారు. జాతీయ విపత్తు సమయంలో కేంద్రం అన్నింటినీ నియంత్రణ చేయలేదా? అని మంత్రి ఈటల రాజేందర్ ప్రశ్నల వర్షం కురిపించారు.