అడ్డగోలు అబద్ధాలను ప్రచారం చేయడం.. అడ్డంగా దొరికిపోవడం బీజేపీ నేతలకు అలవాటైపోయింది. బీజేపీ నేతల్లో ఈటల రాజేందర్ రెండాకులు ఎక్కువే చదివినట్టున్నారు. కొన్నాళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వెలగబెట్టిన ప్రబుద్ధ నేత.. ఓట్లకోసం చౌకబారు ప్రచారానికి తెగబడ్డారు. గ్యాస్బండపై రూ.291 రాష్ట్ర ప్రభుత్వ వాటాగా వస్తున్నదంటూ నోటికొచ్చిన అబద్ధమాడుతున్నారు.
ప్రచారం
ఒక్కో గ్యాస్బండపై రాష్ట్ర ప్రభుత్వానికి రూ.291 పన్నువాటాగా వస్తున్నదని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఈ పన్నును ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ కూడా చేశారు.
గ్యాస్ బండ జీఎస్టీ పరిధిలో ఉన్నది. ఈ అంశం కూడా ఈటలకు తెలియనట్టు మాట్లాడుతున్నారు. గ్యాస్ సిలిండర్పై విధిస్తున్న జీఎస్టీ 5శాతం. ఇందులో కేంద్రానికి 2.5శాతం, రాష్ర్టానికి 2.5 శాతం చొప్పున వస్తుంది. దీని ప్రకారం రాష్ర్టానికి వచ్చే వాటా రూ.20 మాత్రమే. ఈ వివరాలు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ వెబ్సైట్లో స్పష్టంగా ఉన్నాయి. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (పీపీఏసీ) ఈ ఏడాది మేలో విడుదల చేసిన నివేదిక ప్రకారం గ్యాస్ సిలిండర్పై జీఎస్టీ మినహా బేసిక్ కస్టమ్స్ డ్యూటీగానీ, ఎక్సైజ్ డ్యూటీగానీ విధించలేదని స్పష్టంచేసింది. అంటే ఇతర పన్నులేవీ లేవని స్వయంగా కేంద్రమే చెప్పింది. అయినప్పటికీ, ఈటల రాజేందర్ ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.