తెలంగాణ రాష్ట్రంలో జాతీయ సగటును మించి వ్యాక్సినేషన్ పూర్తయింది. బుధవారం నాటికి రాష్ట్రంలో 84.3 శాతం మందికి మొదటి డోస్ పూర్తి కాగా, 38.5 శాతం మందికి రెండో డోస్ వేశాము. అదే సమయంలో జాతీయ స్థాయిలో మొదటి డోస్ 79 శాతంగా, రెండో డోస్ 37.5 శాతంగా నమోదైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, టీకాలు, కొత్త మెడికల్ కాలేజీలు, కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం, వరంగల్లోని మల్టీ సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి నిర్మాణం తదితర అంశాలపై చర్చించడం జరిగింది.
నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగాన్ని మరింత పెంచాలని అధికారులను ఆదేశించడం జరిగింది. వ్యాక్సినేషన్ వేగం పెంచడంలో భాగంగా శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా విద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయం. అధికారులతో చర్చించిన అనంతరం పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాము.
అంతకు ముందు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు కలిసి పాల్గొన్నాను. రాష్టంలో కరోనా కేసులు, వ్యాక్సినేషన్ కార్యక్రమం గురించి వివరించాము. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, సీఎం ఓఎస్డీ గంగాధర్, డీఎంఈ రమేశ్రెడ్డి, కాలోజీ వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు..
* కరోనా తగ్గుముఖం పట్టడంతో 350 పడకలు గల కింగ్ కోఠి జిల్లా దవాఖానలో సాధారణ వైద్యసేవలు పునరుద్ధరణ.
* టిమ్స్ హాస్పిటల్లో 200 పడకలు (ఇవి కోవిడ్ చికిత్స కోసం) మినహా సాధారణ వైద్య సేవలు ప్రారంభం.
* టిమ్స్ సిబ్బంది పెండింగ్ జీతాలు చెల్లింపు.
* టిమ్స్ ఆసుపత్రి బకాయిలు చెల్లింపు.
* వ్యాక్సినేషన్ కార్యక్రమంపై శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఎంహెచ్వోలతో వీడియో కాన్ఫరెన్స్.