తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సీఎం క్యాంప్ కార్యాలయం ప్రగతి భవన్ లో జరిగిన 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి తో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పాల్గొన్నారు.
సీఎం గారు జాతీయ జెండా ను ఆవిష్కరించగా, మంత్రి ఆ జాతీయ జెండాకు వందనం చేశారు. అంతకుముందు గాంధీజీ, అంబేద్కర్ చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఉన్న సైనిక అమర వీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుతూ, ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం, ప్రజలే పరిపాలించుకునే సమాఖ్య స్ఫూర్తితో… దృఢ, అదృఢమైనదిగా విశిష్టమైన రాజ్యాంగం మనదని అన్నారు. సీఎం కెసిఆర్ గారు రాష్ట్రాన్ని ప్రజాస్వామ్య బద్ధంగా, సమాఖ్య స్ఫూర్తి ని చాటుతూ పరిపాలన సాగిస్తున్నారని అన్నారు.
అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేశారని, రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపి గుణాత్మక ప్రగతిని సాధించారని తెలిపారు. ప్రజలందరికీ మంత్రి ఎర్రబెల్లి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.