దేశానికి అన్నం పెట్టే రైతులకు సాయంపై జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో పోరాడి అసువులుబాసిన రైతులకు అండగా నిలవాల్సిన అవసరముందని ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. దేశంలో అమలు చేయాల్సిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాట ఫలితంగానే ప్రధాని మోదీ సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నారన్నారు.
ఈ క్రమంలో రైతు కుటుంబాలకు సాయం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను అభినందించాల్సిందిపోయి విమర్శించడం సిగ్గుచేటన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకం ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటివరకు 80 వేల 755 కుటుంబాలకు రైతుబీమా అందించామన్నారు. కాగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుబీమా పథకం అమలు చేసే దమ్ముందా అని మంత్రి బీజేపీ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.