కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు మాటలు తెలంగాణకు చెప్తూ.. మూటలు మాత్రం గుజరాత్కు తరలించుకుపోతున్నదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. బీజేపీకి గుజరాత్ రాష్ట్రం తప్ప మరో ఆలోచన లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఏదో ఒకటి అమ్ముదామని చూస్తున్నదని, బీజేపీకి అమ్మడం తప్ప వేరే పనేలేదని ఎద్దేవా చేశారు.
మెదక్ జిల్లా నర్సాపూర్లో రూ.4.65 కోట్లతో నిర్మించిన ఆర్టీసీ బస్సు డిపోను బుధవారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి ఆయన ప్రారంభించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మిందని, బీఎస్ఎన్ఎల్లో 50 వేల ఉద్యోగాలను తీసివేసిందని మండిపడ్డారు. రైల్వే ప్రైవేటీకరణ, స్టేషన్ల ప్రైవేటీకరణ చేస్తున్నదని ఫైరయ్యారు.
ప్రభుత్వ సంస్థలను కూడా విక్రయించాలని రాష్ట్రాలకు ఉచిత సలహాలు ఇస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మితే రూ.2 వేల కోట్ల్ల ప్రైజ్ ఇస్తమని ఢిల్లీ నుంచి తెలంగాణ ఆర్థికశాఖకు ఉత్తరం వచ్చిందని మంత్రి అన్నారు. ‘బాయిలకాడ మీటర్లు పెడితే రూ.25 వేల కోట్లు ఇస్తరట! ఆర్టీసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థను అమ్మితే రూ.2 వేల కోట్లు ఇస్తరట! ఇదెక్కడి పరిపాలన?’ అని బీజేపీ ప్రభుత్వంపై హరీశ్రావు మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం కొత్త సంస్కరణలు తీసుకురావాలని, వారి సంక్షేమానికి పాటుపడాలని సూచించారు.
కానీ, బీజేపీ ప్రభుత్వం ఫక్తు వ్యాపార ధోరణితో వ్యవహరిస్తున్నదని, ఎట్లా లాభాలు సంపాదించాలే.. ఎట్లా అమ్మాలే అనే ఆలోచన తప్ప మరో ఆలోచన చేయ డం లేదని విమర్శించారు. అసలు మీ ప్రభుత్వ పాలసీ ఏమిటని బీజేపీ నాయకులను మంత్రి ప్రశ్నించారు. తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం నుంచి హక్కుగా రావాల్సిన రూ.9 వేల కోట్లకు ఎగనామం పెట్టారని అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష అని అన్నారు.