ఆశయం ఎంతో గొప్పది.. ఆర్థిక స్తోమత అంతంతమాత్రమే. అయినా పట్టుదలగా చదివింది. ఎంసెట్లో ఉత్తమ ర్యాంకు సాధించి, ఎంబీబీఎస్ సీటును సంపాదించింది. అయితే.. వైద్య విద్యకు అయ్యే ఖర్చు సామాన్యులు భరించలేనంతగా ఉండడంతో.. తన చదువు ఆగిపోతుందనుకుంది. కానీ.. చదువు విలువ తెలిసిన విద్యావంతుడిగా.. ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడిగా.. నిత్యం జనంలో ఉండే ప్రజా ప్రతినిధిగా పేరున్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు.. సదరు విద్యార్థిని పరిస్థితి తెలుసుకొని.. ఆమె చదువుకు అయ్యే ఖర్చునంతా భరించేందుకు ముందుకొచ్చారు.
వివరాల్లోకెళ్తే…కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం 60 గజాల్లో నివాసం ఉంటున్న ఎం.లక్ష్మయ్య కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నిరుపేద కుటుంబం కావడంతో తన కూతురు ఎం.సంధ్య ప్రైవేట్ పాఠశాలలో చదివే స్థోమత లేక ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల రెసిడెన్షియల్ లో ఇంటర్ వరకు చదివి ఎంబీబీఎస్ కావాలన్న పట్టుదలతో ఎంసెట్ రాయగా అందులో ఉత్తీర్ణత పొంది ఎంబీబీఎస్ సీటు సాధించింది. కాగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని ఆశ్రయించింది.
విద్య యొక్క విలువ తెలిసిన ఎమ్మెల్యే గారు విద్యార్థిని సంధ్య ఎంబీబీఎస్ చదువుల పూర్తి ఖర్చులు తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడిగా గతంలో మొదటి సంవత్సరం కాలేజీ ఫీజు మరియు హాస్టల్ ఫీజు రూ.50 వేలు, రెండవ సంవత్సరం రూ.50 వేలు అందజేశారు. విద్యార్థిని సంధ్య ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో 70% శాతం ఉత్తీర్ణత సాధించింది. 2వ సంవత్సరం ఫలితాలు రావాల్సి ఉన్నాయి. ఈ మేరకు ఈరోజు మూడవ సంవత్సరం కాలేజీ, హాస్టల్ ఫీజు రూ.1 లక్ష చెక్కును ఎమ్మెల్యే గారు విద్యార్థిని సంధ్యకు తన నివాసం వద్ద అందజేశారు. ఈ మేరకు సంధ్య మరియు లక్ష్మయ్య ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు.