తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు .. ఎంపీ అనుముల రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు నేను ఒక్క ఎకరం భూమిని కబ్జా చేసినట్టుగా నిరూపించినట్లయితే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు.
హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఫైర్ అయ్యారు. జనగామ జిల్లా యశ్వంతాపూర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తన 40 ఏళ్ల రాజకీయంలో ఏనాడూ ఒక్క భూకబ్జా కేసు లేదని, ఏ ఒక్కరూ తనపై ఫిర్యాదు కూడా చేయలేదన్నారు.
తమ తాతలకు 1600 ఎకరాల భూమి ఉండేదని, కాలక్రమంగా అమ్ముకుంటూ రాగా ఇప్పుడు 100 ఎకరాలకు చేరిందని చెప్పారు. మరోవైపు మంత్రి దయాకర్రావుపై నిరాధారణ ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వరంగల్ జిల్లా రాయపర్తి పీఎస్లో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.