తెలంగాణ రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో మరో 295 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 295 పోస్టుల మంజూరుతో భర్తీ చేయనున్న మొత్తం పోస్టుల సంఖ్య 1,442కు చేరుకుంది.
22 విభాగాల్లో అదనపు పోస్టులను భర్తీ చేయనుండగా వీటిలో అత్యధికంగా గైనకాలజీ విభాగంలో 45, జనరల్ మెడిసిన్లో 33, జనరల్ సర్జరీలో 32, అనస్థీషియాలో 22 పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే ప్రకటించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది.
వారం నుంచి పదిరోజుల్లో మెరిట్ జాబితా ప్రకటిస్తారు. అభ్యంతరాల పరిశీలన తర్వాత ఎంపిక జాబితా వెల్లడిస్తారు. నెలలోపు నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు రిక్రూట్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్రెడ్డి తెలిపారు.
స్టాఫ్నర్సు పోస్టుల దరఖాస్తుకు నేడు తుది గడువు
రాష్ట్రంలో 5,204 స్టాఫ్నర్సుల పోస్టుల భర్తీకి పది రోజుల్లో పరీక్ష తేదీ ప్రకటించేలా వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు దృష్టి సారించింది. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మంగళవారం ఆఖరు తేదీ కాగా.. ఇప్పటి వరకు 40 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. మే నెలలో పరీక్ష నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.