రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ రోజు తెలంగాణకు చరిత్రాత్మక సందర్భమని అన్నారు. మార్చి 2న సీఎం కేసీఆర్ సమక్షంలో ఫాక్స్కాన్తో ఒప్పందం జరిగిందని గుర్తు చేశారు. రెండు నెలల్లోనే కంపెనీకి భూమి పూజ చేసుకున్నాం. ఇక్కడి వేగం, సమర్థ నాయకత్వం ఎక్కడా లేదని ఫాక్స్కాన్ ప్రతినిధులు చెప్పారన్నారు. తెలంగాణ వేగవంతమైన పనితీరుకు ఇది నిదర్శమనమని కేటీఆర్ వెల్లడించారు.
దేశంలో ఉన్న ప్రధాన సమస్య ఉపాధి కల్పన అని మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రజలందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కాదు. ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వ ఉద్యోగాలు 2 శాతమే ఉంటాయి. స్వయం ఉపాధి, ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పనతో రాష్ట్రానికి అపార సంపద సమకూరుతుందన్నారు.
ఫాక్స్కాన్ రంగారెడ్డి జిల్లాకు రావడం మనందరికీ గర్వకారణమని కేటీఆర్ పేర్కొన్నారు. రానున్న ఐదేండ్లలో కొంగరకలాన్ గుర్తు పట్టలేనంతగా మారబోతున్నదని చెప్పారు. రూ. 4 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఫాక్స్కాన్ పరిశ్రమతో 35 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. వచ్చిన పరిశ్రమలను కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామని ఫాక్స్కాన్ హామీ ఇచ్చింది. అటు కంపెనీ నిర్మాణం జరుగుతుంటే మరోవైపు యువతకు శిక్షణ ఇస్తామన్నారు. యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.
రాష్ట్రంగా ఏర్పడిన 9 ఏండ్లలోనే దేశ స్థాయిలో తెలంగాణ అందరి మన్ననలు పొందుతున్నదని చెప్పారు. తెలంగాణలోని ఏ రంగాన్ని తీసుకున్నా దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పారు. చిన్న రాష్ట్రమైనా 30 శాతం కంటే అధిక అవార్డులను సాధించిందన్నారు. దేశంలోనే స్వచ్ఛ సర్వేక్షణ్లోని 26 అవార్డులు మన రాష్ట్రం సాధించిందని వెల్లడించారు. ఓ వైపు ఐటీ రంగం.. మరోవైపు వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఇంటింటికీ నల్లా ద్వారా మంచి నీళ్లు ఇచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణ. కేంద్రప్రభుత్వం రాష్ట్ర పథకాలను కాపీ కొడుతున్నదని ఎద్దేవా చేశారు. మన మిషన్ భగీరథ చూసి.. కేంద్ర హర్ ఘర్ జల్ పెట్టిందని కేటీఆర్ గుర్తు చేశారు.