హైదరాబాద్ నగరంలో ఉన్న రైల్వే క్రాసింగ్ పైన చేపట్టాల్సిన నిర్మాణాల పై ఒక సమగ్రమైన ప్రణాళికను తయారు చేయాలని మంత్రి శ్రీ కేటీఆర్ పురపాలక శాఖ అధికారులకు సూచించారు. ఈ రోజు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు, పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ మరియు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు మంత్రి కేటీఆర్ నగరంలో చేపట్టాల్సిన రైల్వే అండర్ పాస్, రైల్వే ఓవర్ బ్రిడ్జి మరియు ఇతర రైల్వే శాఖ సంబంధిత పెండింగ్ కార్యక్రమాల పైన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్.ఆర్.డి.పి వంటి అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టి, పెద్దఎత్తున రోడ్డు నెట్వర్క్ ను బలోపేతం చేస్తుందని, అయితే కొన్ని చోట్ల ఇప్పటికీ రైల్వే క్రాసింగ్ ల వలన ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో ఉన్న పరిమితులను చర్చించారు.
జీహెచ్ఎంసీ చేపడుతున్న రోడ్ల మౌలిక వసతుల కల్పనలో సమన్వయం చేసుకొని రైల్వే శాఖ సైతం ఆర్.యు.బి, ఆర్.ఓ.బి ల నిర్మాణానికి వేగంగా అనుమతులు ఇస్తే ఈ ట్రాఫిక్ రద్దీ మరింత తగ్గే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు. ఎస్.ఆర్.డి.పి కి సంబంధించి జీహెచ్ఎంసీ టైం లైన్ లు పెట్టుకొని మరీ వేగంగా పనులను పూర్తి చేస్తున్నదని తెలిపిన కేటీఆర్, రైల్వే శాఖ నిర్మాణ పనులు జీహెచ్ఎంసీ తో పోల్చినప్పుడు కొంత మందకొడిగా నడుస్తున్నాయని అన్నారు. ఈ విషయంలో జీహెచ్ఎంసీ మరియు రైల్వే శాఖ అధికారులు కలిసి నగరంలో చేపట్టాల్సిన రైల్వేశాఖ అభివృద్ధి పనుల పైన ఒక సమగ్రమైన ప్లాన్ ని తయారు చేయాలని సూచించారు. నగరంలో ఉన్న ప్రతి రైల్వే క్రాసింగ్, ఇరుకుగా ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి లను అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడిన కేటీఆర్, ఈ దిశగా రైల్వే శాఖ, జీహెచ్ఎంసీ కలిసి పనిచేస్తే సమన్వయంతో సాధ్యమైనంత తొందరగా మార్పు తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు.
ఈ సందర్భంగా దశాబ్దాల కింద నిర్మాణం చేసిన సికింద్రాబాదులోని రామ్ గోపాల్ పేట రైల్వే అండర్ బ్రిడ్జ్ వంటి వాటిని యుద్ధ ప్రాతిపదికన విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. దీంతోపాటు నగరంలో ఉన్న ఇలాంటి కీలకమైన ప్రాంతాల్లో ఉన్న వాటిని గుర్తించి వేగంగా రైల్వే శాఖ అనుమతులు తీసుకుని ముందుకు పోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు.తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో రోడ్డు నెట్వర్క్ ని బలోపేతం చేయడంతోపాటు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాల పట్ల తమకు అవగాహన ఉన్నదన్న దక్షిణ మధ్యరైల్వే ఉన్నతాధికారులు జీహెచ్ఎంసీ కి సంపూర్ణంగా సహకరిస్తామన్నారు. జీహెచ్ఎంసీ తో కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తామని, సాధ్యమైనంత తొందరగా రైల్వేశాఖ అనుబంధ మౌలిక వసతుల నిర్మాణ కార్యక్రమాలకు అవసరమైన అనుమతుల ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ కు హామీ ఇచ్చారు. తుది అనుమతులు రాగానే సనత్ నగర్, బాలానగర్ రైల్వే అండర్ పాస్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపారు.