యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి శుక్రవారం ఒక్కరోజే రైతుల ఖాతాల్లో రూ.మూడు వేల కోట్లు జమ చేసినట్టు పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
ఇప్పటివరకు రైతుల నుంచి రూ.13,264 కోట్ల విలువైన ధాన్యం కోనుగోలు చేయగా వారి ఖాతాల్లో మొత్తంగా రూ.9,168 కోట్లు జమ చేశామని వివరించారు. ఈ నెల 20 లోగా మిగిలిన రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేస్తామని స్పష్టంచేశారు. ఇప్పటివరకు 11 లక్షల మంది రైతుల నుంచి 64.52 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సీజన్లో 7,034 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయగా కొనుగోళ్లు పూర్తవ్వడంతో 6,143 కేంద్రాలను మూసివేసినట్టు వెల్లడించారు. 18 జిల్లాల్లో ధాన్యం సేకరణ సంపూర్ణంగా పూర్తయిందని చెప్పారు. మిగతా జిల్లాల్లోనూ ఆదివారం కల్లా కొనుగోళ్లు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ యాసంగిలో గత సీజన్ కన్నా 15 లక్షల టన్నుల ధాన్యాన్ని అధికంగా సేకరించామని తెలిపారు.