టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అసలు రూపాన్ని మరోమారు బయటపెట్టారు. కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఒంటేరు సరైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఏపీ ప్రజల అభివృద్ధికి టీఆర్ఎస్ ఏనాడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రాంతాలకతీతంగా కేసీఆర్ సుపరిపాలన అందించారని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్ల తర్వాత కేంద్రం నుంచి చంద్రబాబు బయటకు వచ్చారని.. 36 ఏళ్ల ప్రత్యర్థి కాంగ్రెస్ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని తెలిపారు. మోడీని బూచిగా చూపుతూ బాబు అసమర్థతో మాట్లాడుతున్నారని విమర్శించారు.
బీజేపీ నేతల చెంపలు చెల్లుమనేలా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారని కేటీఆర్ అన్నారు. మోడీ వట్టి బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. యూపీలో కూడా ఓట్లు చీలకుండా ఎస్పీ, బీఎస్పీ కలిపిపోయాయని.. కాంగ్రెస్, బీజేపీలతో పొత్తు ఉండదని ఆ రెండు పార్టీలు చెబుతున్నాయని తెలిపారు. జగన్ కూడా కేంద్రానికి వ్యతిరేకంగా కలిసి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఢిల్లీలో టీఆర్ఎస్ నిర్ణయాత్మక శక్తిగా ఉండే రోజు దూరంలో లేదన్నారు.