విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా ఈ రోజు జనగామ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పాలకుర్తి శ్రీ స్వయంభు శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. స్వామివారికి ఆలయ అర్చకులు, అధికారులు, భక్తులు శాస్తోక్తంగా ఘనస్వాగతం పలికారు. ఆలయంలో స్వామి వారు సోమేశ్వరుడికి ప్రత్యేక అభిషేకం జరుపుతుండగా ఆలయ ప్రాంగణాలన్నీ వేదం, ఆశీర్వవచనాలతో మార్మోగాయి. పూజల అనంతరం స్వామి వారు భక్తులందరికీ సనాతన వైదిక ధర్మ గొప్పతనాన్ని, హిందూ ధర్మ పరిరక్షణ గురించి వివరించారు. స్వామివారి ఆగమనం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్వామి వారి ధర్మ ప్రచార యాత్ర తెలుగు రాష్ట్రాల సమన్వయ కర్త , దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి, ఆలయ ఈఓ వీరస్వామి, ఆలయ అర్చకులు, పట్టణ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.