ఓ ప్రైవేటు మహిళా కళాశాల హాస్టల్ వద్ద ప్రమాదం జరిగింది. స్నేహితురాలికి బిర్యాని ప్యాకెట్లు, బిస్కెట్లు తీసుకువచ్చి చున్నీల సహాయంతో భవనంలోని మూడో అంతస్తుకు పంపే క్రమంలో విద్యుత్ ప్రమాదం జరిగింది. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేయూ జంక్షన్ సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఈ సంఘటన చోటుచేసుకోగా స్థానికుల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..
ప్రైవేటు కళాశాలలోని హాస్టల్లో ఉంటున్న స్నేహితురాలి కోసం బయటి కళాశాలకు చెందిన ఓ విద్యార్థి బుధవారం రాత్రి 11గంటలకు ప్రాంతంలో బిర్యాని, బిస్కెట్ ప్యాకెట్లు తీసుకువచ్చాడు. స్నేహితుడితో కలిసి వచ్చిన సదరు విద్యార్థి స్నేహితురాలికి సమాచారం అందించాడు. మూడో అంతస్తులో ఉన్న విద్యార్థిని కిందికి వచ్చి తీసుకునే అవకాశం లేకపోవడంతో చున్నీలను ముడివేసి కిందకి పంపించి పైకి లాగే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కళాశాల భవనం సమీపంలోని కరెంటు వైర్లకు బిర్యాని ప్యాకెట్లతో ఉన్న చున్నీ తగలడంతో మంటలు లేశాయి.
కరెంటు వైర్ల నుంచి మంటలు రావడంతో సమీపంలోని గృహాల వారంతా భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే కళాశాల వెలుపల ఉన్న ఇద్దరు విద్యార్థులు తమ వాహనాన్ని వదిలి పారిపోయే ప్రయత్నం చేయగా స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో విద్యార్థులను మందలించి వదిలేశారు. విద్యార్థినులను సైతం హెచ్చరించారు. సంఘటన జరిగిన విషయాన్ని కేయూ ఎస్ఐ జి.సుబ్బారెడ్డి ధ్రువీకరించారు.