కరోనా వైరస్లో కొత్త మార్పులు చోటు చేసుకొన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మార్పులతో వైరస్ విస్తృతంగా వ్యాపిస్తే అభివృద్ధి చేస్తున్న టీకాలు పనిచేయవనే భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. డెన్మార్క్లో మింక్ అనే జీవి నుంచి ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్లు గుర్తించారు.
ఆ దేశానికి చెందిన ది స్టేటెన్స్ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఈ విషయాన్ని గుర్తించింది. దీంతో అప్రమత్తమైన డెన్మార్క్ ప్రభుత్వం దేశంలోని ఉత్తర జూట్ల్యాండ్ మున్సిపాలిటీల్లో కొత్త ఆంక్షలను విధించింది. ఈ ప్రాంతంలో వందల కొద్ద ఫారమ్ల్లో మింక్లను పెంపకం చేపట్టారు.
ప్రధాని మెట్టీ ఫ్రెడ్రెక్సన్ ఉత్తర డెన్మార్క్లో అదనపు కొవిడ్ ఆంక్షలు ఏడో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. ఇవి దాదాపు 2,80,000 లక్షల మందిపై ప్రత్యక్షంగా ప్రభావం చూపవచ్చు. కొత్తగా అభివృద్ధి చేస్తున్న కొవిడ్ టీకాలుకు ఈ రకం వైరస్ ముప్పుగా మారవచ్చని ప్రభుత్వం హెచ్చరించింది.
అక్కడ నివశించేవారు ప్రయాణాలు చేయవద్దని ప్రధాని పేర్కొన్నారు. దీనిని ఉల్లంఘిస్తే వ్యాధి వ్యాపించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ ఉత్తర జూట్ల్యాండ్ వాసులు వ్యాధి వ్యాపించకుండా శతవిధాల కృషిచేయాలి. ప్రపంచం మనల్ని గమనిస్తోంది’’ అని ప్రధాని ఫెడ్రెక్సన్ పిలుపునిచ్చారు.