కాంగ్రెస్ పార్టీకి వలసల పర్వం షాకిస్తున్న నేపధ్యంలో పంజాబ్, చత్తీస్ఘఢ్ అనుభవాల తర్వాత తాజాగా మేఘాలయలో ఆ పార్టీకి సంక్షోభం ఎదురుకానుంది. సీనియర్ నేత, మాజీ సీఎం ముకుల్ సంగ్మా కాంగ్రెస్ను వీడనున్నారనే ప్రచారం ఊపందుకుంది.
సంగ్మాతో పాటు దాదాపు 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ను వీడి తృణమూల్ కాంగ్రెస్లో చేరతారని సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేసే దిశగా మేఘాలయలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెబుతున్నారు.
అయితే తృణమూల్లో చేరికకు ముందు అంతర్గత అంశాలను పరిష్కరించుకునేందుకు పార్టీ అగ్రనేతలతో చర్చిస్తామని సంగ్మా పేర్కొన్నారు. మేఘాలయాలో విపక్ష నేతగా ఉన్న సంగ్మాతో తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికే మంతనాలు సాగించినట్టు సమాచారం. కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్గా ఎంపీ విన్సెంట్ నియామకం పట్ల గుర్రుగా ఉన్న సంగ్మాను తమ పార్టీ గూటికి తీసుకువచ్చేందుకు తృణమూల్ ప్రయత్నాలు ఎంతమేరకు ఫలిస్తాయనేది వేచిచూడాలి.